అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి త్వరలోనే ముగింపు

అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి త్వరలోనే ముగింపు
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే యుద్ధం దాదాపు ముగిసినట్టే కనిపిస్తుందని చెప్పారు.  ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నిజంగా వార్ ముగిసిందా అని యాంక‌ర్ మ‌రోసారి సూటిగా ప్ర‌శ్న వేయ‌డంతో ముగింపు ద‌శ‌కు చేరుకున్న‌ట్లు ట్రంప్ సంకేతం ఇచ్చారు. 
 
యుద్ధం ముగియ‌డానికి ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని అనుకుంటాన‌ని, దాదాపు ముగిసింద‌నే అనుకుంటాన‌ని ట్రంప్ తెలిపారు. అయితే ఇంకా పూర్తి స్థాయి పరిష్కారం కోసం చర్చలు కొనసాగాల్సి ఉందని స్పష్టం చేశారు.  ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ రాజధాని టెహ్రాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, వారు కూడా ఒప్పందం చేసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.   
ఇక అమెరికా చేపట్టిన సైనిక చర్యలపై మాట్లాడుతూ, తమ దాడులు ఇరాన్‌పై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. ముఖ్యంగా ఇజ్రాయెల్​తో కలిసి చేసిన ఆపరేషన్ల వల్ల ఇరాన్‌లో మౌలిక వసతులకు భారీ నష్టం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తే పునర్నిర్మాణానికి దాదాపు 20 ఏళ్లు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు.  “మేము ఆపకపోతే ఇప్పుడు వాళ్ల దగ్గర అణ్వాయుధం ఉండేది. అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయేది” అని ఆయన తెలిపారు.
ఇదే సందర్భంలో జర్నలిస్టును ఉద్దేశించి మాట్లాడుతూ, “వాళ్ల వద్ద అణ్వాయుధం ఉంటే మీరు వాళ్లను సర్ అని పిలవాల్సి వచ్చేది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.  ఇక యుద్ధ పరిస్థితుల మధ్య దౌత్య చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొదటి విడత చర్చలు స్పష్టమైన ఫలితాలు ఇవ్వకపోయినా, రెండో విడత చర్చలపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్ పేరు ముందుకు వస్తోంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో బృందం పాల్గొనే అవకాశముందని సమాచారం.

మరోవైపు యుద్ధం పూర్తిగా ముగిసే దశలో ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలతో పాటు, అమెరికా ఇంకా తన సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయలేదని కూడా స్పష్టం చేశారు. “మేము ఇంకా పూర్తిగా వెనక్కి తగ్గలేదు. పరిస్థితులను బట్టి ముందడుగు వేస్తాం” అని తెలిపారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం అమలు చేస్తున్న నౌకా నిర్బంధం కూడా ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ చర్యల వల్ల ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే పలువురు నౌకలు తిరిగి వెనుదిరిగినట్లు సమాచారం.