ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం ద్వారా అనేక దేశాలు ఇబ్బంది పడుతుండటంతో ప్రపంచ దేశాలకు చమురు సహా ఆహారం, ఎరువులు, ఇతర ఉత్పత్తుల రవాణా ఆగిపోయింది. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ జలసంధి సమస్య తీరకముందే బాబ్ ఎల్ మాండెబ్ అనే మరో జలసంధిని కూడా ఇరాన్ మూసేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
దీనికి కారణం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబఫ్ చేసిన ట్వీట్. ‘‘బాబ్ ఎల్ మాండెబ్ అనే జలసంధి ద్వారా ప్రపంచానికి ఎంత చమురు, ఎల్ఎన్జీ, గోధుమలు, బియ్యం, ఎరువులు వంటివి రవాణా అవుతుంటాయి? ఏ దేశం, ఏ సంస్థ ఈ జలసంధి నుంచి ఎక్కువ రవాణా చేస్తుంటాయి?’’ అని ప్రశ్నిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్ ఈ జలసంధిపై కూడా దృష్టిపెట్టిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఇప్పటికే హార్ముజ్ కారణంగా ప్రపంచం చమురు సంక్షోభంలో పడింది. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో ఆయిల్ దొరకడం లేదు. ఆహారోత్పత్తుల రవాణా ఆగిపోయింది. ఈ జలసంధి ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇంకో మార్గాన్ని కూడా ఇరాన్ మూసేస్తే ప్రపంచం మరింత ఇబ్బంది పడుతుంది. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి.
ఇటు హార్ముజ్, అటు బాబ్ ఎల్ మాండెబ్ జలసంధులు ప్రపంచ నౌకా రవాణాకు ఎంతో కీలకం. ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ప్రపంచ వాణిజ్యంలో ఈ మార్గం వాటా 10-12 శాతం ఉంది. ప్రతి సంవత్సరం రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరుకుల రవాణా ఈ జలసంధి నుంచే జరుగుతుంది. అలాంటిది యుద్ధం నేపథ్యంలో జలసంధిని మూసేస్తే ఈ మొత్తం వ్యాపారం స్తంభించడం ఖాయం.
మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ సైన్యం, తన అనుబంధ సైన్యం కలిసి వేవ్ 93 పేరుతో, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ప్రారంభించాయి. మరోవంక, ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గంపై తనకున్న పట్టు, అమెరికాపై ఇరాన్కు ఉన్న ఏకైక నిజమైన బలం కాబట్టి, ఆ దేశం హోర్ముజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని ఇటీవలి అమెరికా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
శుక్రవారం, ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి తాను అమెరికా బలగాలను ఆదేశించవచ్చని డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు కనిపించింది.
“మరికొంత సమయం ఉంటే, మనం హోర్ముజ్ జలసంధిని సులభంగా తెరిచి, చమురును స్వాధీనం చేసుకుని, భారీగా లాభాలు గడించవచ్చు,” అని ఆయన తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు.
కానీ, జలసంధికి ఒక వైపున నియంత్రణలో ఉన్న ఇరాన్పై బలప్రయోగం చేయడానికి ప్రయత్నించడం నష్టదాయకంగా ఉంటుందని, అది అమెరికాను సుదీర్ఘ భూతల యుద్ధంలోకి లాగుతుందని విశ్లేషకులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. “ఇరాన్ సామూహిక విధ్వంసక ఆయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో, అమెరికా ఇరాన్కు సామూహిక విఘాత ఆయుధాన్ని అందించింది,” అని సంఘర్షణ నివారణ సంస్థ అయిన ‘ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్’లోని ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అలీ వాజ్ అమెరికాను ఎద్దేవా చేశారు.

More Stories
శ్యామ ప్రసాద్ ముఖర్జీ సహాయకుడికి మోదీ పాదాభివందనం!
రూ.100 కోట్ల పిఎంఎల్ఏ కేసులో పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్
బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం