కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాన్ని ఖాళీచేయండి

కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాన్ని ఖాళీచేయండి

కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాన్ని ఖాళీ చేయాల‌ని ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని 24 అక్బ‌ర్ రోడ్డులో ఉన్న ఆఫీసును మార్చి 28వ తేదీ లోగా ఖాళీ చేయాల‌ని నోటీసులు జారీ అయిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 48 ఏళ్ల పాటు అక్బ‌ర్ రోడ్డులోని భ‌వ‌నం కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన కార్యాల‌యంగా సేవ‌లు అందించింది.  కోట్లా మార్గ్‌లో గ‌త ఏడాది కాంగ్రెస్ పార్టీ కొత్త భ‌వ‌నాన్ని ప్రారంభించింది. ఇందిరా భ‌వ‌న్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాల‌యాన్ని నిర్మించింది.

అయితే ఈ నేప‌థ్యంలో అక్బ‌ర్ రోడ్డులో ఉన్న ఆఫీసును ఖాళీ చేయాల‌ని ప్ర‌భుత్వం నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అక్బ‌ర్ రోడ్డు బిల్డింగ్ ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యంగా చాన్నాళ్లు ప‌నిచేసింది.  దీనితో పాటు 5 రైసినా రోడ్డులోని భారతీయ యువజన కాంగ్రెస్ కార్యాలయంను ఖాళీచేయమని కూడా నోటీసు ఇచ్చారు.  వీటితో పాటు చాణక్యపురిలోని మరికొన్ని విభాగాలకు కూడా నోటీసులు అందినట్లు సమాచారం.

గడువు ముగిసినా భవనాలను అప్పగించకపోవడమే దీనికి ప్రధాన కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  కొత్త కార్యాలయం ప్రారంభించినా ఇంకా పాత కార్యాల‌యాన్ని వాడ‌డం ప‌ట్ల ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అక్బ‌ర్ రోడ్డులో ఉన్న ఆఫీసుకు పెద్ద చ‌రిత్రే ఉన్న‌ది. రాజ‌కీయంగా, చ‌రిత్రాత్మ‌కంగా ఆ భవనంకు చాలా ప్రాముఖ్య‌త ఉన్న‌ది. స్వాతంత్య్రం రావ‌డానికి ముందు ఆ ప్రాప‌ర్టీని బ్రిటీష్ వైస్‌రాయ్ స‌ర్ రెజినాల్డ్ మ్యాక్స్‌వెల్ నివాసంగా వాడుకున్నారు. 

మ‌య‌న్మార్ అంబాసిడ‌ర్ దా ఖిన్ కియా నివాసంగా కూడా వినియోగించారు. ఈ ఇంట్లోనే ఆయ‌న కూతురు ఆంగ్‌సాన్ సూకీ కూడా త‌న బాల్యాన్ని గ‌డిపారు. ఇక 1977లో ఓట‌మి త‌ర్వాత ఇందిరా గాంధీ ఈ భవనం నుంచి మ‌ళ్లీ త‌న స‌మ‌రాన్ని కొన‌సాగించారు. ఆ త‌ర్వాత ఆ భవనం పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంగా కొన‌సాగింది. రాజీవ్ గాంధీ, పీవీ న‌ర్సింహారావు, మ‌న్మోహ‌న్ సింగ్ కూడా ఈ కార్యాల‌యం నుంచే ఎదిగారు.