ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు
బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారి వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2026 ఫిబ్రవరి 12న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏఎంఎం నాసిరుద్దీన్ గురువారం ప్రకటించారు.

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తన పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని సీఈసీ నాసిరుద్దీన్కు బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్‌ బుధవారం తెలిపారు. ఆ తర్వాత రోజునే సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడడం గమనార్హం.  సార్వత్రిక ఎన్నికల నాడే ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 

నామినేషన్ పత్రాల సమర్పణకు చివరి తేదీ 2025 డిసెంబర్ 29. నామినేషన్ల పరిశీలన డిసెంబర్ 30- జనవరి 4 వరకు జరుగుతుంది. నామపత్రాలను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 2026 జనవరి 20. అభ్యర్థుల తుది జాబితా జనవరి 21నాటికి తేలిపోతుంది. ఎన్నికల ప్రచారం జనవరి 22న ప్రారంభమై ఫిబ్రవరి 10న ఉదయం 7.30 వరకు చేసుకోవచ్చు.

2024లో జరిగిన బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా దాని మిత్రపక్షాలు ఆ ఎన్నికలను బహిష్కరిస్తూ దూరంగా ఉన్న వేళ అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల స్థానాలను దక్కించుకుంది. అయితే విపత్కర పరిస్థితుల్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీ గుర్తింపును రద్దు చేసింది. దీంతో ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయితే 2026లో బంగ్లాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌ పీ), అవామీ లీగ్ పూర్వ మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.  మొత్తం 300 సీట్లకు ఇరుపార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. గతే అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో జమాతే ఇస్లామీ పార్టీ నిషేధానికి గురైంది. అయితే, విద్యార్థుల నిరసనల తర్వాత షఫీకుర్ రెహమాన్ నాయకత్వంలో ఆ పార్టీ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు మళ్లీ బలం పుంజుకుంది.