నలుగురు డాక్టర్ల అరెస్టుతో వెల్లడైన ఉగ్రదాడుల్లో ఉన్నత విద్యావంతులు

నలుగురు డాక్టర్ల అరెస్టుతో వెల్లడైన ఉగ్రదాడుల్లో ఉన్నత విద్యావంతులు
పేదరికం, అక్షరాస్యత లేకపోవడం, నిరుద్యోగం వల్లే ముస్లింలు ఉగ్రవాదులుగా మారుతున్నారని మన దేశంలో లౌకికవాదులుగా చెప్పుకొనే రాజకీయ వేత్తలు, వామపక్ష భావజాలం గలవారు వారిపట్ల సానుభూతి చూపే ప్రయత్నం తరచుగా చేస్తున్నారు. అయితే, నాలుగు రోజుల్లోనే నలుగురు వైద్యుల అరెస్టులు కలవరపెట్టే ధోరణిని సూచిస్తున్నాయి.  తాజాగా ఎర్రకోట వద్ద జరిగిన దాడి కూడా ఓ డాక్టర్ పర్యవేకషణలో జరిగిన్నట్లు తెలుస్తోంది.
ఉన్నత విద్యావంతులైన నిపుణులు తమ హోదాలను, విజ్ఞానాన్ని ఉగ్రవాద ఎజెండాలకు ఉపయోగించుకోవడం కలకలం రేపుతోంది.  ఈ నిపుణులు అంతర్జాతీయ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని, దేశంలోని వివిధ ప్రాంతాలలో రసాయన, తుపాకీ ఆధారిత దాడులకు చురుకుగా సిద్ధమవుతున్నారని అధికారులు హెచ్చరించారు.  రెండు వేర్వేరు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లతోపాటు వారి సహచరులు మరి కొందరిని పోలీసులు \ అరెస్టు చేశారు. 
ఈ ఘటనలతో ఉన్నతమైన వృత్తిలో ఉన్న వారిని సైతం ఉగ్రవాద సంస్థలు తమ ఉచ్చులోకి లాగినట్లు వెల్లడి కావడంతోపాటు దేశంలో పెరుగుతున్న వైట్‌-కాలర్‌ ఉగ్ర వ్యవస్థ కూడా వెలుగులోకి వచ్చింది.  డాక్టర్లను, ఉన్నత విద్యావంతులను ముందు నిలబెట్టి వీరి ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నది విదేశీ ఉగ్ర నిర్వాహకుల కుట్రగా అధికారులు అనుమానిస్తున్నారు. హర్యానాలో మహిళా డాక్టర్‌ షహీన్‌ కారులో రైఫిల్‌, లైవ్‌ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 
ఉత్తరప్రదేశ్‌, హర్యానా, జమ్ము కశ్మీరులో ఏకకాలంలో జరిగిన అరెస్టులలో 2,900 కిలోలకు పైగా బరువున్న బాంబు తయారీ సామగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో జరిగిన మరో ఘటనలో అరెస్టులతోపాటు విషాన్ని తయారుచేసే పదార్థాలతోపాటు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అయితే వీరందరి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నదీ అధికారులు ఇప్పటివరకు వెల్లడిచలేదు.
అరెస్టయిన డాక్టర్లకు పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ ఉగ్రశక్తులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిషిద్ధ ఉగ్ర సంస్థలైన ఐసిస్‌, జైషే మొహమ్మద్‌, అన్సార్‌ ఘజ్వాత్‌-ఉల్‌-హింద్‌(ఏజీయూహెచ్‌) కూడా ఈ డాక్టర్ల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. కశ్మీరుకు చెందిన డాక్టర్‌ ముజమ్మీల్‌ గనీని ఫరీదాబాద్‌లో అరెస్టు చేయగా లక్నో డాక్టర్‌ షహీన్‌ని కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కోసం విమానంలో శ్రీనగర్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అతడి కారులో ఓ ఏకే-47 రైఫిల్‌ దొరికినట్లు వారు చెప్పారు. 
 
నలుగురు డాక్టర్లతోపాటు మరో నలుగురు వారి సహచరులను అరెస్టు చేసినట్లు ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. గనీ, అదీల్‌ ఫోన్లలో పాకిస్థానీ నంబర్లు అనేకం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ నంబర్లు ఈ నెట్‌వర్క్‌ నిర్వాహకులది కావచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌ డాక్టర్‌ అహ్మద్‌ మొహీయుద్దీన్‌ సయ్యద్‌(35) అరెస్టు భద్రతా దళాలలో ప్రకంపనలు సృష్టించింది.
చైనా నుండి మెడికల్ డిగ్రీ అందుకొన్న అతను ఆముదం గింజల నుంచి రిసిన్‌ అనే విషపూరిత పదార్థాన్ని తయారుచేస్తున్న సయ్యద్‌ ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండి, అహ్మదాబాద్‌లోని పండ్ల మార్కెట్‌, లక్నోలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని రెక్కీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రెండు గ్లాక్‌ పిస్టళ్లు, ఓ బెరెట్టా, 30 లైవ్‌ కార్ట్రిడ్జులు, నాలుగు లీటర్ల ఆముదం నూనె అతని ఇంట్లో లభించాయి. ఖొరాసన్‌ ప్రావిన్సుకు చెందిన అబూ ఖదీమ్‌ అనే ఐసిస్‌ ఉగ్రవాదితో సయ్యద్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
అయితే హర్యానా, జమ్ము కశ్మీరు పోలీసు చేసిన అరెస్టులకు, సయ్యద్‌ అరెస్టుకు ఏమైనా సంబంధం ఉన్నదీ లేనిదీ అధికారులు వెల్లడించలేదు. గతంలో కూడా పలు సందర్భాలలో ఉగ్రవాద సంస్థలతో పనిచేస్తున్న పలువురు ఉన్నత విద్యావంతులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రులైన ఇండియన్ ముజాహిద్దీన్, ఐఎస్ కెపి (ఐఎస్ఐఎస్) లతో సంబంధం గల అబ్దుల్లా బాసిత్; సిరియా/ఇరాక్ లలో ఐఎస్ఐఎస్ లో  ప్రయత్నించిన మొహమ్మద్ అబ్దుల్లా, మాజ్ హాసన్ ఫరూక్ లు అరెస్ట్ అయ్యారు.
కేరళలో కాసరగోడ్ కు చెందిన డాక్టర్ ఇజాజ్ కల్లుకేట్టియ పురాయిల్ 2016లో తన భార్యతో కలిసి ఐఎస్ఐఎస్ లో చేరేందుకు ఆఫ్ఘానిస్తాన్ వెళ్లారు. అదే ప్రాంతం నుండి ఇంజనీర్ అబ్దుల్ రషీద్ అబ్దుల్లా ఐఎస్ఐఎస్ లో చేరేందుకు కేరళకు 21 మందిని తరలించడంలో సూత్రధారిగా గుర్తించారు.  కేరళలోని ఎర్నాకులం నుండి ఉన్నత విద్యావంతులైన నిమిషా @ ఫాతిమా, మెర్రిన్ జాకబ్@ మరియం మరో ఇద్దరు మహిళలతో కలిసి ఐస్ఐఎస్ లో చేరేందుకు ఆఫ్ఘానిస్తాన్ వెళ్లారు. బెంగళూరులో కంటివైద్యుడు అబ్దుల్ రహమాన్ ఐఎస్ఐఎస్ కోసం మెడికల్ యాప్, క్షిపణి అభివృద్ధికి ప్రయత్నించారు.
బెంగుళూరుకు చెందిన ఐటి నిపుణులు మోహదీ బిస్వాస్ @షామి విట్నెస్ పేరుతో ఆన్ లైన్ లో ఐఎస్ఐఎస్ కు అతిపెద్ద ప్రచారకర్తగా పనిచేశారు. ముంబైకి చెందిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సాదిక్ ఇసార్ షేఖ్ ఇండియన్ ముజాయుద్దీన్ (ఐఎం) సహా వ్యవస్థాపకుడు. బాంబుల తయారీలో నిపుణుడు. పూణే కు చెందిన డాక్టర్ అద్నానాలి సర్కార్ ను ఐఎస్ఐఎస్ మోడ్యూల్ కేసులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.  రాజస్థాన్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మహమ్మద్ వకార్ అహ్మద్, మహమ్మద్ మహారూఫ్ ఐఎం రాజస్థాన్ ఐఎం మోడ్యూల్ లో ఐఈడి ల తయారవుకోసం నీయమితులయ్యారు.