పాక్ కోర్టు ఆవరణలో భారీ పేలుడు.. 12 మంది మృతి

పాక్ కోర్టు ఆవరణలో భారీ పేలుడు.. 12 మంది మృతి
దాయాది పాకిస్థాన్‌లో ఇస్లామాబాద్‌లోని కోర్టు ఆవరణలో  భారీ పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో 12 మందికిపైగా మరణించగా, సుమారు 20 మంది గాయపడ్డారు. పాక్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలోని పార్కింగ్‌ స్థలంలో ఓ కారులో పేలుడు సంభవించింది. వాహనంలో అమర్చిన గ్యాస్ సిలిండర్ వల్ల ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనను పోలీసులు ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో కాలిపోతున్న వాహనం, ఆ మంటల వల్ల దట్టమైన పొగలు అలుముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. 

సంఘటనా స్థలానికి రెస్క్యూ, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయి. రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో న్యాయవాదులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధి వరకూ వినిపించినట్లు స్థానిక మీడియా నివేదించింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, కోర్టు సిబ్బందిగా పేర్కొంది.

కాగా, దక్షిణ వజీరిస్థాన్‌ లోని కాడెట్‌ కాలేజ్‌ వానా వద్ద తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ దాడిని పాక్‌ భద్రతా దళాలు భగ్నం చేశాయి. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న టీటీపీ ప్రయత్నాన్ని పాక్‌ బలగాలు అడ్డుకున్నాయి. టీటీపీ ప్రయత్నాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్‌ కోర్టు ఆవరణలో బ్లాస్ట్‌ జరగడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.