`మార్వాడీ గో బ్యాక్’ పేరుతోకాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలు

`మార్వాడీ గో బ్యాక్’ పేరుతోకాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలు

`మార్వాడీ గో బ్యాక్’ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను స్రుష్టించారు. జీడీపిని పెంపులో వారి పాత్ర చాలా ఉంది” అని తెలిపారు.

“హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి మార్వాడీలు తెలంగాణ నుండి ఎందుకు వెళ్లిపోవాలి?’’అని సంజయ్ ప్రశ్నించారు. `మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ కుల వ్రుత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు `మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమాలు చేస్తే బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వ్రుత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సంజయ్ హెచ్చరించారు. దీంతోపాటు రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.  హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో బీజేపీ సెంట్రల్ జిల్లా శాఖ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా ర్యాలీ’’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావుతో కలిసి పాల్గొంటూ  మటన్ ఎవరు కొట్టాలి? అని ప్రశ్నించారు. 

“హిందువులైన కటికోళ్లు మటన్ కొట్టాలి. హిందూ రజకులు బట్టలుతుకుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? నయీం మటన్ షాపు, సలీం డ్రై క్లీన్ షాపులు పెడుతుంటే ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.

కాగా, ఓట్లను తొలగించేది, చేర్చించేది ఎన్నికల సంఘం పని అని పేర్కొంటూ ఓట్లకు బీజేపీకి సంబంధం ఏముంది? అని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద సంస్థ అని చెబుతూ నిజంగా ఓట్ల చోరీ మా చేతుల్లో ఉంటే మాకు 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అన్నీ సీట్లలో గెలిచేవాళ్లం కదా? తెలంగాణ, కర్ణాటకలో బీజేపీయే అధికారంలోకి వచ్చేది కదా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

“నేనడుగుతున్నా తెలంగాణలో ఓట్ల చోరీ చేసే కాంగ్రెస్ గెలిచిందా? ఓట్ల చోరీ చేసే కర్ణాటకలో గెలిచిందా? ఓట్ల చోరీ చేసే ఇండీ కూటమి 230 ఎంపీ సీట్లను గెలుచుకుందా? మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం.. ఓడిపోతే ఓట్ల చోరీ జరిగినట్లా? వాళ్లు చేస్తే సంసారం… మేం చేస్తే వ్యభిచారమా? ఇదేం పద్దతి?” అంటూ ఎద్దేవా చేశారు.