నల్లాని రాజేశ్వరికి `దక్షిణ భారత మహిళా విజేత’ పురస్కారం 

నల్లాని రాజేశ్వరికి `దక్షిణ భారత మహిళా విజేత’ పురస్కారం 
 
మూడు దశాబ్దాలకు పైగా బహుముఖ సేవలందిస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి, కవయిత్రి, కాలమిస్ట్‌ నల్లాని రాజేశ్వరి దక్షిణ భారత మహిళా విజేత – 2025 పురస్కారానికి ఎంపికయ్యారు.  విద్య, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవారంగాల్లో ఆమె అందిస్తున్న బహుముఖ సేవలు స్ఫూర్తిదాయకమని అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించింది. 
 
అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ తమిళనాడు రాష్ట్ర శాఖ, ట్వల్‌ మేగజైన్‌, గ్లోబల్‌ పింక్‌ ఆర్మీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ”బేటీ బచావో – బేటీ పడావో” విభాగం తమ వంతు సహకారం అందిస్తున్నాయి. జూలై ఆరో తేదీ చెన్నైలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేయనున్నారు. 
 
గతంలో నల్లాని రాజేశ్వరి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ”రాజ్యమహిళా సమ్మాన్‌” అవార్డు – 2014ను ప్రకటించింది. ఒక రాష్ట్రం నుంచి కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చే ఈ అవార్డును, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2015 మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు సభలో రాజేశ్వరికి అందజేసారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున విశిష్ట మహిళా అవార్డు – 2018, ఉగాది పురస్కారం – 2017 ను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రాజేశ్వరి అందుకున్నారు. 
 
ఉమ్మడి అనంతపురం జిల్లా బాలల సంక్షేమ సమితి (సి.డబ్ల్యు.సి) చైర్‌ పర్సన్‌ గా 2018-21 కాలంలో నల్లాని విశేష సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విద్యాహక్కుచట్టం పటిష్ట అమలుకు రాష్ట్ర ప్రభుత్వ సలహామండలి సభ్యురాలిగా కీలక సేవలందించారు. శ్రీవెంకటేశ్వర ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శిగా, ఉదయ్ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలిగా, నల్లాని రాజేశ్వరి ఇన్షియేటివ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (సోషియాలజీ), బి.ఎడ్‌., ( సోషల్‌ స్టడీస్‌) పూర్తి చేశారు. ఎస్కేయూ సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ జి.వి రమణ పర్యవేక్షణలో, ”అనంతపురం జిల్లాలో బాలకార్మిక సమస్యలు – సవాళ్లు : ఒక అధ్యయనం” అనే అంశంపై రాజేశ్వరి పిహెచ్‌.డి., పరిశోధన కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా పీజీ డిప్లమో ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (పిజిడిసిఏ) పూర్తి చేశారు. 
 
అంతేగాకుండా ”బాలికా విద్య, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత, ప్రజారోగ్యం, నైతిక విలువల పెంపు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాలపై ప్రముఖ తెలుగు దినపత్రికల ఎడిటోరియల్‌ పేజీలో పలు వ్యాసాలు రాస్తున్నారు. టిటిడి ప్రచురిస్తున్న ”సప్తగిరి” మాసపత్రికలో ”బాలనీతి” శీర్షికతో బాలల కథలు, స్ఫూర్తిదాయక వ్యాసాలను వెలువరిస్తున్నారు. 
 
నల్లాని రాజేశ్వరి సామాజిక వ్యాసాల సంపుటి ”సాధికారత” పుస్తకాన్ని 2019 జూలైలో అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. నల్లాని స్వీయ కవితాసంపుటి ”బంగారుతల్లి” పుస్తకాన్ని 2021లో అప్పటి ”తానా” అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వ అధ్యక్షులు, ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు తిరుపతిలో ఆవిష్కరించారు. 
 
ఆమె సేవలకు గుర్తింపుగా విద్యారత్న, సేవారత్న, మహిళా రత్న, బాలసేవక్‌ తదితర అవార్డులు, బిరుదులతో పలు సంస్థలు సత్కరించాయి. తెలంగాణ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా 2017లో బతుకమ్మ పురస్కారంతో పాటు ఉత్తమ కవయిత్రిగా విశిష్ట అవార్డులతో సత్కరించాయి. 
 
హైదరాబాద్‌ లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017 డిసెంబర్‌ లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ కవయిత్రిగా సత్కరించింది. జాతీయ మహిళాకమిషన్‌ రజతోత్సవ వేడుకల సందర్భంగా 2018 జనవరి 31న ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతినిధిగా కీలకోపన్యాసం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జాతీయ మహిళా కమిషన్‌, తెలంగాణ రాష్ట్ర మహిళాకమిషన్‌ సంయుక్తంగా హైదరాబాద్‌ లో నిర్వహించిన జాతీయ మహిళావిధానం ముసాయిదా – 2016 సంప్రదింపుల సమావేశంలో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.