రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 500% సుంకం

రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 500% సుంకం

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసా గించే దేశాలపై ఏకంగా 500 శాతం సుంకాలు విధిస్తా మని అమెరికా హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన టారిఫ్‌ బిల్లు సూచిస్తోంది. ఈ బిల్లును వచ్చే నెలలో సెనెట్‌ ముందు ఉంచే అవకాశం ఉంది. సెనెటర్‌ లిండ్సే గ్రహం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారీ సుంకాల ప్రతిపాద నను బయటపెట్టారు.

“మీరు రష్యా నుండి ఉత్పత్తులు కొనుగోలు చేసినా, ఉక్రెయి న్‌కు సాయం అందించక పోయినా అమెరికాలో ప్రవేశించే మీ వస్తువులపై 500 శాతం సుంకం విధిస్తారు. భారత్‌, చైనాలు రష్యా చమురులో 70 శాతం కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా ఆ దేశాలు పుతిన్‌ యుద్ధానికి బాసటగా నిలుస్తున్నాయి” అని ఆయన తెలిపారు. రష్యా నుండి చమురు, ఇతర వస్తువులు కొనుగోలు చేయకుండా భారత్‌, చైనా వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లును ఉద్దేశించామని, దీని ద్వారా రష్యా యుద్ధాన్ని బలహీనపరచి ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేలా మాస్కో ను ఒప్పించాలని భావిస్తున్నామని గ్రహం చెప్పారు. 

అయితే, భారత్‌తో కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందం కారణంగా అమెరికా కంపెనీలపై సుంకాల భారం అతి తక్కువగానే పడుతుందని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ట్రంప్‌ బుధవారం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో విలేకరులతో మాట్లాడారు. 

“భారత్‌ మన దేశంతో ఒప్పందానికి వస్తుందని అనుకుంటు న్నాను. ఈ ఒప్పందం భిన్నంగా ఉంటుంది. మనం భారత్‌లో ప్రవేశించి పోటీ పడవచ్చు. ప్రస్తుతం భారత్‌ ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కానీ మనకు ఆ అవకాశం ఇస్తుందని భావిస్తున్నా. వారు అలా చేస్తే మనం అతి తక్కువ సుంకాలకే ఒప్పందం కుదుర్చు కుంటాం” అని ట్రంప్‌ తెలిపారు. 

అమెరికా నుండి భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండేలా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చు కోబోతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్య చేశారు. కాగా సుంకాల అమలుకు ట్రంప్‌ ఇచ్చిన 90 రోజుల గడువు ఈ నెల 9న ముగుస్తున్న తరుణంలో ఆలోగానే ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్‌ కోరుకుంటోంది. చర్చలు తుది దశకు చేరుకు న్నాయని విదేశాంగ మంత్రి జైశంకకర్‌ కూడా చెప్పారు.