ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు

ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు

* ఈ వారాంతంలో ఇరాన్ పై దాడులకు దిగనున్న అమెరికా!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లతో దద్దరిపోతోంది. టెహ్రాన్ ప్రాంతం మొత్తం అగ్ని మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడి ప్రత్యేకంగా టెహ్రాన్‌లోని లావిజాన్ ప్రాంతంపై జరిగిందని చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భద్రతా బంకర్ కూడా ఈ ప్రాంతంలోనే ఉందని భావిస్తున్నారు. ఆయ‌న‌నే ల‌క్ష్యంగా చేసుకుని 60 యుద్ద విమానాల‌తో మెరుపుదాడి చేసింది ఇజ్రాయెల్. 

టెహ్రాన్‌లోని నోబోన్యాద్ స్క్వేర్‌ను లక్ష్యంగా చేసుకుని అక్క‌డ విధ్వంస‌కాండ సృష్టించింది. ఇందులో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అనేక కర్మాగారాలు ఉన్నాయి. ఇరాన్ క్షిపణి, సైనిక కార్యక్రమానికి సంబంధించిన పెద్ద కర్మాగారాలు, బంకర్లు ఉన్న ప్రదేశాలు ఇవి. వాటిలో చాలా వాటిని ఈ దాడుల‌తో నేల మ‌ట్టం చేసింది ఇజ్రాయెల్

అంతకుముందు, నెతన్యాహు కూడా ఒక ఇంటర్వ్యూలో ఖమేనీ మరణం తర్వాతే ఈ యుద్ధం ఆగుతుందని స్పష్టం చేశారు.  ఖమేనీని అంతమొందిస్తామని పేర్కొంటూ తమ లక్ష్యం చేరుకోవాలంటే ఖమేనీ ఉనికిలో ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (ఐడీఎఫ్) ఇరాన్ నాయకుడిని అంతమొందించేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

అదే సమయంలో, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ దేశానికి తన సందేశాన్ని ఇస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్‌తో సహా అనేక ప్రదేశాలపై బాంబు దాడి చేశాయని సమాచారం. ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్స్ టెహ్రాన్‌లోని లావిజాన్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. లావిజాన్‌ను ఖమేనీ రహస్య స్థావరంలో ఉన్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే , ఖమేనీ ప్రసంగం కొన్ని గంటల క్రితం రికార్డ్ చేసినట్లు భావిస్తున్నారు. ఖోజిర్, పార్చిన్ వంటి సున్నితమైన ప్రాంతాలపై కూడా దాడి జరిగింది. అటువంటి పరిస్థితిలో, ఈ వివాదం రాబోయే కొన్ని గంటల్లో మరింత తీవ్రమైన రూపాన్ని దాల్చవచ్చని భావిస్తున్నారు. ఇరాన్ క్షిప‌ణుల‌తో ఎదురు దాడికి దిగింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవిన్ లోని స్టాక్ ఎక్స్ంజ్ తో పాటు ఇజ్రాయెల్‌లోని బీర్‌షెబా నగరంలో ఉన్న సొరోకా మెడికల్ సెంటర్‌ ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ తెలిపింది.

ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది. ఆ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మీడియాతో మాట్లాడుతూ  “ఏ ఒక్కరినీ వదలొద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశాను. న్యూస్ హెడ్‌లైన్స్ కోసం నేను అస్సలు పాకులాడను. జరగబోయే చర్యలే ఇకపై మాట్లాడుతాయ్” అని స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. 

ఇరాన్‌లోని అరాక్‌ భార జల పరిశోధనా రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ గురువారం ధ్రువీకరించింది. క్షిపణి దాడి జరిగిన సమయంలో అరాక్‌ రియాక్టర్‌ అణు సామర్థ్యాన్ని కలిగి లేదని, రేడియోధార్మిక విషవాయువు ముప్పు ఏదీ ప్రజలకు లేదని టీవీ ప్రకటించింది. ఈ దాడి జరగడానికి ముందుగానే అణు కేంద్రాన్ని ఖాళీ చేసినట్లు తెలిపింది. కాగా తాము అరాక్‌ రియాక్టర్‌పై దాడి చేయనున్నామని, ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గురువారం తెల్లవారుజామునే ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీచేసింది. 

ఇరాన్‌లోని అరక్, ఖోండాబ్ నగర ప్రజలకు ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. సొంత భద్రత కోసం ఆ ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరింది. ఫార్సీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఐడీఎఫ్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వారాంతంలోనే అమెరికా కూడా ఇరాన్‌పై దాడులకు దిగొచ్చని నివేదికలు అందుతున్నాయి.  ఇందుకు సంబంధించిన ప్రణాళికకు కూడా ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. 

రాబోయే రోజుల్లో ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడొచ్చని తెలిపింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీప నగరాలను ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయమని హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఇరాన్ ప్రభుత్వం సేవలను నిలిపివేసింది.