మోదీ ప్రకటనతో కాల్పుల విరమణపై దిగివచ్చిన ట్రంప్!

మోదీ ప్రకటనతో కాల్పుల విరమణపై దిగివచ్చిన ట్రంప్!
* ఇరాన్ కు వ్యతిరేకంగా ట్రంప్ కు పాక్ ఆర్మీ చీఫ్ మద్దతు!
 
భారత్‌ -పాక్‌ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  పదేపదే చెప్పుకోవడం భారత్‌లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని  నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌కు తేల్చి చెప్పారు. 
“భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు, ఎప్పటికీ అంగీకరించదు” అని మోదీ ట్రంప్‌తో చెప్పిన తర్వాత ట్రంప్ మాట్లలలో తీడా స్పష్టంగా వెల్లడైంది. కెనడాలో జరిగిన జి7 సదస్సులో ట్రంప్ తో స్వయంగా ఈ విషయమై ప్రధాని మోదీ ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అయితే మోదీ చేరుకోవడానికి ముందే ట్రంప్ అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి వెళ్లడంతో ఆయన ఫోన్ లో 35 నిముషాలసేపు మాట్లాడారు.  ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.

దానితో ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. భారత్‌-పాక్‌ చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌ సైన్యాధిపతి, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఆయనకు ట్రంప్‌ వైట్ హౌస్ లో విందు ఇచ్చారు. 

అనంతరం ఓవల్‌ ఆఫీస్‌లో మునీర్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ “భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో నా ప్రమేయం లేదు. ఇద్దరు తెలివైన నేతలు యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారి తీసేవి. ఆ రెండు దేశాలూ అణుశక్తి కలగినవి. అందుకే చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి” అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పిన్నట్లు  కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వివరాలను ట్రంప్‌కు మోదీ వివరించినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలటరీ స్థాయి చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిస్రీ వివరించారు.

“యుద్ధాన్ని నేనే ఆపాను. పాకిస్థాన్‌ అంటే నాకు ఇష్టం. ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి. మోదీతో ఫోన్‌లో మాట్లాడాను. భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. పాకిస్థాన్‌-భారత్‌ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. ఆయన (పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌) చాలా ప్రభావవంతమైన వ్యక్తి. పాకిస్థాన్‌ వైపు నుంచి ఆయన, భారత్‌ తరఫున మోదీ, ఇతరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారు. రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. ఈ అంశంపై నేనేమీ కథ రాయాలని భావించడం లేదు. నేను యుద్ధాన్ని ఆపాను అంతే. ఈ అంశంపై మీరు ఎవరైనా కథ రాశారా?”అంటూ పొంతనలేకుండా మాట్లాడారు.

ఇలా ఉండగా, ఒక వంక ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ ఉక్కిరి, బిక్కిరి అవుతున్న సమయంలో తమపై ఇజ్రాయిల్ అణ్వస్త్రాలు ప్రయోగిస్తే పాకిస్థాన్ అణ్వస్త్రాలతో తమకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన్నట్లు ఇరాన్ చెప్పుకొంటున్న సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించడం, వైట్ హౌస్ లో ట్రంప్ ఆయనకు విందు ఏర్పాటు చేయడం విస్మయం కలిగిస్తుంది.

అణ్వస్త్రాలపై ఇరాన్ ప్రకటించిన వెంటనే అటువంటి ఏదీ ఇరాన్ కు ఇవ్వలేదంటూ నిర్మోహాటంగా పాకిస్తాన్ ఖండించడం గమనార్హం. పైగా ప్రతిష్టాకరమైన జి7 సదస్సు మధ్యలో ట్రంప్ వెనుకకు వెళ్లి మునీర్ కు ఆతిధ్యం ఇవ్వడం సహితం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయిల్ లకు వ్యూహాత్మక మద్దతు ఇచ్చేందుకు పాక్ ఆర్మీ చీఫ్ సుముఖంగా ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. 

ప్రస్తుతం ఇరాన్ పై జరుగుతున్న దాడులలో తమ భూభాగం (గాలి, భూమి, సముద్రం) బహిరంగ వినియోగంకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడవుతుంది. మరోవంక, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నారో తనకు ఖచ్చితంగా తెలుసని ట్రంప్ చెప్పడం వెనుక మునీర్ అమెరికాకు కీలకమైన నిఘా సమాచారాన్ని అందిస్తున్నట్లు అనుమానాలు కలిగిస్తున్నది. 

ఇలా ఉండగా, ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం చాలా అరుదైన విషయం. అంతకుముందు అయూబ్‌ ఖాన్‌, జియా ఉల్‌-హక్‌, పర్వేజ్‌ ముషారఫ్‌ వంటి వారికి ఆహ్వానం అందినప్పటికీ వాళ్లు పాకిస్థాన్​ అధ్యక్షులుగా ఉన్నారు. తాజాగా మునీర్‌కు అమెరికా నుంచి ఆహ్వానం అందడాన్ని పాకిస్థాన్‌ అధికారులు తమ దౌత్య విజయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తలుపులు మూసి ఉంచిన గదిలో ఇరువురు విందు చేసినట్లు సమాచారం. ఓవైపు ఇరాన్‌కు పాకిస్థాన్‌కు సన్నిహత దేశం కావడం, మరోవైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.