హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమానానికి  బాంబు బెదిరింపు రావడంతో హైదరాబాద్ లో దిగకుండానే వెనుకకు మళ్లించారు. లుఫ్తాన్సా ఎల్‌హెచ్ 752 విమానానికి ఈ బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఫైలట్ ల్యాండ్ చేయలేదు. విమానం తిరిగి జర్మ నీకి ప్రయాణమైంది. 
 
కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన విమానం తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయానికి వెళ్లింది. దీంతో జర్మనీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు.  జర్మనీ నుంచి బయలుదేరిన విమానం దాదాపు 8, 9 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. విమానంలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందిన ప్రయాణీకులు ఉన్నారు. అలాగే ముంబైకు చెందిన వారు కూడా ఉన్నారు. 
 
అయితే బాంబు బెదిరింపు కారణంతో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమానానం తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌‌కు వెళ్లింది. అక్కడ ఎయిర్ పోర్టు అధికారులు పరిశీలించిన తర్వాత బాంబు లేదని తేల్చారు. అదొక నకిలీ కాల్‌గా గుర్తించారు. అయినా మరో 2, 3 గంటలు విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత బయలుదేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాశ్రయంలోనే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.జర్మనీ నుంచి బయలుదేరిన సుమారు రెండు గంటల ప్రయాణం అనంతరం విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఫైలట్ తిరిగి ఫ్లైట్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. అనంతరం అధికారులు విమానాన్ని ఆధీనంలోకి తీసుకొని భద్రత చర్యలు చేపట్టారు. ఎల్‌హెచ్‌ 752 విమానం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టు నుంచి అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు బయలుదేరింది. 

షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రి దాటాక చేరుకోవాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. హైదరాబాద్‌లో విమానం ల్యాండింగ్‌కు అనుమతి రాకపోవడంతోనే ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రయాణికులకు విమానాశ్రయంలోనే వసతి కల్పించినట్లు తెలియవచ్చింది. సోమవారం ఉదయం ఆ విమానం మళ్లీ హైదరాబాద్‌కు బయలుదేరనుట్లు సమాచారం.