భారత్‌ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు

భారత్‌ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు
భారత్‌ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ స్పష్టం చేశారు. భాగస్వామ్య దేశాలు దానిని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దుష్టులు బాధితులతో సమానం కాదని పేర్కొంటూ  బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రి డేవిడ్‌ లామీతో డిల్లీలో భేటీ అయిన జైశంకర్, పలు వ్యాఖ్యలు చేశారు.

“ఉగ్రవాదాన్ని మేం ఎన్నటికీ సహించబోం. ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని మేం అనుసరిస్తున్నాం. మా భాగస్వామ్య దేశాలు దానిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే మేం ఎన్నటికీ అంగీకరించబోం” అని జై శంకర్ తేల్చి చెప్పారు. 

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్‌ ప్రభుత్వానికి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమాన్ని ఖండించిన అనేక ప్రపంచ దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. అయితే భారత్, బ్రిటన్​ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మైలురాయిగా జైశంకర్ ఇప్పుడు అభివర్ణించారు. 

డేవిడ్​ లామీతో తాజాగా జరిగిన భేటీ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. “ఇటీవల భారత్​- యూకే ఎఫ్‌టీఏ, డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ నిజంగా ఒక మైలురాయి. అది ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వ్యూహాత్మక అంశాలపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది” అని జైశంకర్ వెల్లడించారు. 

భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం రెండు దేశాల ఆశయాలకు ప్రారంభం మాత్రమే అని డేవిడ్ తెలిపారు. “కొత్త ప్రపంచం కోసం భారత్ మేం ఆధునిక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాం. వృద్ధిని అందించడం, వినూత్న సాంకేతికతను పెంపొందించడం, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం, పలు ప్రాధాన్యాలను అందించడం, మా ప్రజలకు ఎక్కువ భద్రతను అందించడం వంటి విషయాలలో మరింత సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి, సహకరించడానికి మేం మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాం” ఆయన చెప్పారు.