ఈశాన్య రాష్ట్రాల వరదలపై ప్రధాని మోదీ దృష్టి

ఈశాన్య రాష్ట్రాల వరదలపై ప్రధాని మోదీ దృష్టి

ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్, మణిపుర్‌ గవర్నర్‌ అజయ్‌భల్లాలకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి 40 మంది చనిపోగా, దాదాపు 6 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇ‌బ్బందులు ఎదుర్కొంటున్నారు.

నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి అసోం ఇంకా కోలుకోలేదు.  అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం-ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వరద 22 జిల్లాలకు విస్తరించింది. దీనితో దాదాపు 5.3 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో 11 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. 22 జిల్లాల్లోని 1,254 గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు తెలిపారు. శ్రీభూమి జిల్లాలో అత్యంత దారుణంగా పరిస్థితులు ఉన్నట్లు వివరించారు. 

165 వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన అసోం ప్రభుత్వం 31,212 మందిని తరలించింది. మరో 157 కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేస్తోంది. బ్రహ్మపుత్ర, బరక్‌, కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సుబన్‌సిరి, బుర్హిదిహింగ్‌, ధన్‌సిరి, రుక్ని, ధలేశ్వరి, కటాఖల్, ఖుషియారా నదులు ప్రమాదకర స్థాయిని తాకుతూ ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి.

మణిపూర్‌లో వరద ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇంఫాల్‌ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగి ఉంది. ఐరిల్ నది మహోగ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టడంలేదు. ఇళ్లన్నీ నీటమునిగి ఉన్న నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బలగాలు బాధితులను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా 47 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.

మిజోరాం వ్యాప్తంగా వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాల్లో ఇంకా కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు 190 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. 190కిపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ ఎక్కువ ప్రభావితమైంది. గత 10 రోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మిజోరాంలో ఐదుగురు మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు మంగళవారం తెలిపారు.

మంగళవారం ఉదయం కూడా జోరు వాన కురిసి అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఐజ్వాల్‌లో వరుసగా నాలుగో రోజూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని 552 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. 152 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పగుళ్ల కారణంగా 198 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినట్లు చెప్పారు. 

మొత్తం 11 జిల్లాల్లో మయన్మార్‌తో సరిహద్దును పంచుకునే తూర్పు మిజోరాంలోని చంపాయి జిల్లాపై తీవ్ర ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. ఇక్కడ 209 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు వివరించారు. తొమ్మిది ఇళ్లు దెబ్బతినగా.. 14 కుటుంబాలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. వర్షం కారణంగా సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్ల ద్వారా 34 మందిని పాంగ్‌యాంగ్ విమానాశ్రయానికి చేర్చింది.