ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు మావోయిస్టులు హతం

ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు మావోయిస్టులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వర్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు,  ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఐదుగురు మావోయిస్టులు గురువారం హతమయ్యారు.  జమ్ముకశ్మీర్‌లో గురువారం ఉదయం కిష్ట్‌వర్‌ జిల్లాలోని సింగ్‌పొరా చత్రూ ప్రాంతంలో భద్రతా బలగాలు, అస్సాం రైఫిల్స్‌, కిష్ట్‌వర్‌ స్పెషల్‌ పార్టీ పోలీసులు సంయుక్తంగా ఛట్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో ముగ్గురు నలుగురు ఉగ్రవాదులను చట్టుముట్టాయి. దీంతో ఇరుపక్షాల మధ్య ఉదయం 7 గంటల నుంచి హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపాయి. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

గత రెండు వారాల్లో జమ్ముకశ్మీర్‌లో ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో గతవారం ముగ్గురు జైషే మహమ్మద్‌ టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసేంది. కాగా, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగి గురువారానికి నెల రోజులు పూర్తయింది.

కాగా, బీజాపూర్‌ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్‌ సభ్యుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.