5 ఏళ్ల త‌ర్వాత 720 మందితో కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర‌

5 ఏళ్ల త‌ర్వాత 720 మందితో కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర‌

అయిదేళ్ల అంతరాయం త‌ర్వాత ఈ ఏడాది కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈసారి 720 మంది భ‌క్తులు ఆ యాత్ర‌కు వెళ్ల‌నున్నారు. వీరితోపాటు 30 మంది ల‌యిజ‌న్ ఆఫీస‌ర్లు ఉంటార‌ని విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ల‌క్కీ డ్రా ద్వారా యాత్రికుల‌ను ఎంపిక చేశారు. కంప్యూట‌ర్ జ‌న‌రేటెడ్ ప‌ద్ధ‌తిలో ర్యాండ‌మ్‌గా వ్య‌క్తుల‌ను ఎంపిక చేశారు.గ‌త అయిదేళ్ల నుంచి మాన‌స స‌రోవ‌ర యాత్ర‌ను నిలిపివేసిన విష‌యం తెలిసిందే.

2020 నుంచి ఆ యాత్ర జ‌ర‌గ‌డం లేదు. కరోనా వ‌ల్ల నిలిపివేశారు. చైనీస్ ప్ర‌భుత్వం వైపు నుంచి యాత్ర ఏర్పాట్ల గురించి స‌మాచారం రాక‌పోవ‌డంతో మాన‌స స‌రోవ‌ర యాత్ర‌ను ఆపేశారు. జూన్ మూడ‌వ వారం నుంచి యాత్ర ప్రారంభంకానున్న‌ది. ఆగ‌స్టు 25వ తేదీన ముగుస్తుంది. రెండు మార్గాల్లో మాన‌స స‌రోవ‌ర యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ఉత్త‌రాఖండ్‌, సిక్కిం రూట్ల‌లో ఇది జ‌ర‌గ‌నున్న‌ది. అన్ని రూట్లు క‌లిపి మొత్తం 720 మంది యాత్రికుల‌కు మాత్ర‌మే ఈ సారి అవ‌కాశం క‌ల్పించారు.

కైలాస ప‌ర్వ‌తంతో పాటు మాన‌స స‌రోవరం టిబెట్‌లో ఉన్నాయి.  ఉత్త‌రాఖండ్ మార్గంలో 5 బ్యాచ్‌ల‌ను పంపుతారు. ఒక్కొక్క బ్యాచ్‌లో 48 మంది ఉంటారు. ఇక సిక్కింలోని నాథులాపాస్ మీదుగా కూడా 48 మందితో కూడిన 10 బ్యాచ్‌ల‌ను పంప‌నున్నారు. ఈసారి 5384 మంది యాత్ర కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంట్లో 3898 మంది పురుషులు, 1486 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 

65 ఏళ్లు దాటిన వారు 404 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. హిందువుల‌తో పాటు బౌద్దులు, జైనుల‌కు కూడా ఈ యాత్ర ప‌విత్ర‌మైంద‌ని విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వ‌ర్ధ‌న్ సింగ్ తెలిపారు. లిపులేక్ పాస్‌, నాథులా పాస్ మార్గంలో రోడ్ల‌ను కూడా నిర్మించార‌ని, దీని వ‌ల్ల వృద్ధ యాత్రికుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.