రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

రాష్ట్రంలో పెరుగుతున్న రోహింగ్యాల ముప్పు పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా వలస వచ్చిన రోహింగ్యాలు అంతర్గత భద్రతకు ప్రమాదంగా పరిణమించారని తెలిపారు. 

ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్ కత నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చార‌ని గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.  రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయ‌ని చెబుతూ వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ అని ప‌వ‌న్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా ప్రధాన నినాదమ‌ని ఆయన గుర్తు చేశారు. రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారని, మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని పవన్ విమర్శించారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉందని విమర్శించారు. 

వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారనేది తేలాలని స్పష్టం చేశారు. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుందని చెప్పారు. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమ‌ని ఆయన స్పష్టం చేశారు. 

దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ సంబంధిత అధికారుల‌కు లేఖలు రాశానని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని పేర్కొన్నారు.  గతంలో కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. పాలనా యంత్రంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిజిపిని కోరారు.

ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చ‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉంద‌ని అంటూ గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయ‌ని వివ‌రించారు. కాగా, సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటకు, పొలాలలో ఉన్నవారి ప్రాణాలను తీస్తున్నాయ‌ని ప‌వ‌న్ కళ్యాణ్ తెలిపారు.
ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఉంద‌ని చెప్పారు.  వాటికి పరిష్కారంగా గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నామ‌ని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఇవ్వనుంద‌ని చెప్పారు.. కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల విధ్వంసం నుంచి బయటపడగలం అనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.