ఆరోగ్యకర ప్రపంచం కోసం ప్రధాని మోదీ 3 సూత్రాలు

ఆరోగ్యకర ప్రపంచం కోసం ప్రధాని మోదీ 3 సూత్రాలు
`ప్రపంచానికి ఒకే ఆరోగ్యం’ (‘వన్ వరల్డ్ ఫర్ హెల్త్’) అనే ఉమ్మడి భావనతో ఎన్నో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు భారత్ సహకారాన్ని అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆరోగ్యకరమైన ప్రపంచ సాధన కోసం మూడు సూత్రాలను పాటించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐక్య (సమ్మిళిత) భావన, సమగ్ర దృష్టి, సహకార భావంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగితే ఆరోగ్యకరమైన ప్రపంచం సాకారం అవుతుందని మోదీ చెప్పారు. 

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి వర్చువల్‌గా భారత ప్రధాని ప్రసంగిస్తూ భారత్‌లో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సమ్మిళిత భావనకు గొప్ప నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని, దాని ద్వారా భారత్‌లో 58 కోట్ల మందికి ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు వెల్లడించారు. 

ఈ పథకాన్ని ఇటీవలే 70 ఏళ్లకు పైబడిన భారతీయులకూ విస్తరించామని మోదీ చెప్పారు. ‘ఒక భూమి కోసం ఒక ఆరోగ్యం కోసం యోగా’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం జూన్ 21న భారత్‌లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచానికి యోగాను అందించిన భారతదేశం నుంచి ఈ ఆహ్వానాన్ని అందుకోవాలని కోరారు.

“భారతదేశం అందిపుచ్చుకున్న చాలా సాంకేతికతలను గ్లోబల్ సౌత్‌ దేశాలతో పంచుకోవడానికి మేం సిద్ధం. వారికి అండగా నిలుస్తాం. ఆయా దేశాల్లో ఉన్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సాయం చేస్తాం. ఆరోగ్య రంగంలో భారత్ తీసుకొచ్చిన డిజిటలైజేషన్ విధానాలు, సాంకేతికతల వల్ల ప్రభుత్వ ఖర్చులు చాలావరకు తగ్గాయి. ఆరోగ్య అంశాల్లో ఏ దేశమూ వెనుకబడిపోకుండా చూసుకుందాం” అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ప్రపంచ దేశాలు సహకారంతో ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ఇంటర్ గవర్న్‌మెంటల్ నెగోషియేటింగ్ బాడీ (ఐఎన్‌బీ)తో ఒప్పందంపై జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి. ఇది గొప్ప విషయం. ఇందుకుగానూ డబ్ల్యూహెచ్‌ఓ, దాని సభ్య దేశాలను అభినందనలు అని మోదీ తెలిపారు. ఆరోగ్యకరమైన భూగ్రహాన్ని నిర్మిస్తూనే, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను సహకారంతో ఎదుర్కొనే విషయంలో ప్రపంచదేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతకు ఈ ఒప్పందమే నిదర్శనమన్నారు.

“క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, వాటిని నిర్ధారించే ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల పెద్ద నెట్‌వర్క్‌ భారత్‌లో ఉంది. వేలాది మంది ప్రభుత్వ ఫార్మసిస్ట్‌లు మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే అధిక నాణ్యత కలిగిన మందులను అందిస్తున్నారు” అని భారత ప్రధాని తెలిపారు. 

“దేశంలో జరిగే అన్ని రకాల వ్యాక్సినేషన్లను ట్రాక్ చేయడానికి వీలుగా భారతదేశానికి ఒక డిజిటల్ వేదిక ఉంది. దాని ద్వారా మేం గర్భిణులు, పిల్లల టీకా కార్యక్రమాన్ని సులభంగా మానిటర్ చేస్తాం. టెలీ మెడిసిన్ అనేది ప్రతీ ఒక్కరిని వైద్యులకు చేరువ చేసింది. భారత్‌లో ప్రారంభించిన ఉచిత టెలీ మెడిసిన్ సేవను ఇప్పటివరకు 34కోట్ల మందికిపైగా వినియోగించారు. దేశ ప్రజల ఆరోగ్య, బీమా రికార్డులను మేం డిజిటలైజ్ చేశాం” అని మోదీ వివరించారు.