విజయనగరం కుట్ర కేసులో సౌదీ ఆదేశాలు అమలు

విజయనగరం కుట్ర కేసులో సౌదీ ఆదేశాలు అమలు
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సౌదీ నుంచి ఐసిస్‌ హ్యాండ్లర్లు ఇచ్చేఆదేశాలనుసిరాజ్‌ ఉర్‌ రహ్మన్‌(29), సమీర్ (28) అమలు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు, పోలీసులు గుర్తించారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై సిరాజ్ రిహార్సల్ చేసినట్లు తేల్చారు. గత ఆరు నెలల్లో సిరాజ్ మూడు సార్లు సౌదీ వెళ్ళినట్టు పోలీసులకు వివరాలు అందాయి. టిఫిన్ బాక్స్ బాంబ్‌లు తయారు చేయాలని సిరాజ్, సమీర్‌కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూపు క్రియేట్ చేసుకున్నారని .. సిరాజ్, సమీర్‌తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ బోయిగూడ వాసి సమీర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ విశాఖ జైలులో ఉన్నారు. సిరాజ్‌, సమీర్‌తో పాటు మరో నలుగురు ఇటీవల హైదరాబాద్‌లో కలుసుకొని వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.

సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఐసిస్‌ హ్యాండ్లర్‌ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించడం, బాంబులు తయారుచేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలిచ్చారని సమాచారం.  పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని ఆన్‌లైన్‌లో సిరాజ్‌ కొనుగోలు చేసినట్లు చెబుతున్న పోలీసులు అరెస్ట్ సమయంలో సిరాజ్‌ వద్ద భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో అమ్మోనియం నైట్రేట్‌, సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్‌ సీజ్‌ చేసినట్లు సమాచారం.

 పదో తరగతి చదివి సికింద్రాబాద్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా చేస్తున్న సమీర్ తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. సిరాజ్, సమీర్ ఫోన్‌లో కీలక సమాచారం సేకరించిన పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు.  ఉగ్ర సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరిని నిర్దేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు కలిసి అల్‌హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ – అహిం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుడుపై రిహార్సల్‌ చేయాలని హ్యాండ్లర్‌ నిందితులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. 

రిహార్సల్ విజయవంతమైతే ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి చెప్పినట్లు సమాచారం.  ఇప్పుటికే ఇద్దరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు. సిరాజ్‌, సమీర్‌ని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు విజయనగరం టూటౌన్‌ స్టేషన్‌కు వచ్చి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.