
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2040 నాటికి మానవులను చంద్రునిపైకి పంపాలని యోచిస్తోంది. తమిళనాడులోని తేని సమీపంలోని వాడపుడుపట్టిలోని ఒక ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ “చంద్రునిపైకి మానవులను పంపించే ప్రయోగాన్ని 2040 నాటికి షెడ్యూల్ చేశాం. అయితే ఇందుకోసం విస్తృతమైన పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి” అని తెలిపారు.
ఇస్రో రెండవ ప్రయోగ వేదికను తమిళనాడులోని కులశేఖరపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం 95% భూమిని కేటాయించిందని చెబుతూ డిసెంబర్ 2026 నాటికి కులశేఖరపట్నం నుంచి ఒక రాకెట్ ప్రయోగించనుట్లు తెలిపారు. మూడవ ప్రయోగ వేదికను శ్రీ హరికోటలో ఏర్పాటు చేస్తారని తెలిపారు.
“చంద్రయాన్-2 విజయవంతం కాలేదు. కారణం తెలుసుకోవడానికి 10 మంది శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేశాం. శాస్త్రవేత్తలు ఒక నెల పాటు రాత్రీ పగలు తేడా లేకుండా అహోరాత్రులు శ్రమించి 8 నెలలు పట్టే పనిని కేవలం ఒక నెలలోనే పూర్తి చేశారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా మేం చంద్రయాన్-3ని విజయవంతంగా అభివృద్ధి చేసి ప్రయోగించాం” అని వివరించారు.
“తదుపరిది చంద్రయాన్-4 ప్రాజెక్ట్. దీని బరువు మొత్తం 9600 కిలోలు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చంద్రునిపైకి దిగి 14 రోజులు మాత్రమే అధ్యయనం చేసింది. కానీ చంద్రయాన్-4 చంద్రునిలోకి లోతుగా వెళ్లి, నమూనాలను తీసుకొని భూమికి తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అనంతరం చంద్రయాన్-5కు వెళ్లనున్నాం” అని వివరించారు. “దీన్ని చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ల్యాండర్ మాదిరిగానే రూపొందించనున్నాం. ఇది చంద్రునిపై దిగి 100 రోజుల పాటు వివరంగా అధ్యయనం చేస్తుంది. చంద్రయాన్-4, చంద్రయాన్-5 ప్రాజెక్టుల తర్వాతే మానవులను చంద్రునిపైకి పంపించనున్నాం” అని నారాయణన్ వెల్లడించారు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు