పాకిస్తాన్ ఆజ్యం పోయబట్టే భారత్ స్పందించాల్సి వస్తుంది 

పాకిస్తాన్ ఆజ్యం పోయబట్టే భారత్ స్పందించాల్సి వస్తుంది 
పహల్గాం ఉగ్రదాడితో ఏప్రిల్ 22న ఉద్రిక్తతలను పాకిస్తాన్ ఆజ్యం పోయబట్టే భారత్ ఇంకా స్పందించాల్సి వస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్‌పై దాడికి పాకిస్థాన్ యత్నించిందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ దాడులను భారత గగనతల రక్షణ వ్యవస్థ బలంగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇందుకు ప్రతిగా భారత్ నిర్వహించిన ఆపరేషన్‌లో లాహోర్‌లోని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆయన పేర్కొన్నారు.

‘‘పాకిస్తాన్ ప్రస్థానమే అబద్ధాలతో మొదలైంది. అసత్య ప్రచారాలు చేయడం పాకిస్థాన్‌కు అలవాటే. ఆపరేషన్ సిందూర్‌ అనేది పాక్ దుశ్చర్యకు సమాధానం మాత్రమే. పౌరులను కాపాడుకునే భారత హక్కును ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అనేక దేశాలతో భారత్‌ సంప్రదింపులు జరుపుతోంది. పహల్గాం దాడిపై బదులిచ్చే హక్కు భారత్‌కు ఉంది’’ అని ఆయన తేల్చి చెప్పారు.

భారత సైనిక దాడుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్‌ ఆర్మీ అధికారులు హాజరైన చిత్రాన్ని విక్రమ్ మిస్రీ ప్రదర్శించారు. సాధారణ పౌరులను చంపమని పాక్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శవపేటికలపై పాకిస్థాన్‌ జెండాలు కప్పి ప్రభుత్వ లాంఛనాలతో పౌరులకు అంత్యక్రియలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ” హతమైన వ్యక్తులు ఉగ్రవాదులే. అలాంటి ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు బహుశా పాకిస్థాన్‌లో ఒక ఆచారం కావచ్చు. ఇది మాకు పెద్దగా అర్థం కాలేదు” అని ఎద్దేవా చేశారు.

‘‘సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తోందని పాక్ దుష్ప్రచారం చేస్తోంది. భారత్‌ 60 ఏళ్లుగా ఆ ఒప్పందాన్ని గౌరవించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్నందుకే ఒప్పందాన్ని రద్దు చేశాం’’ అని విక్రమ్ మిస్రీ చెప్పారు.

‘‘ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ సామాన్య పౌరులు చనిపోయారనేది అవాస్తవం. ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా వాస్తవం కాదు. కొన్ని ప్రార్థనా స్థలాలను పాక్‌ దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాద స్థావరాలుగా మార్చుకుంది. పాకిస్థాన్ మాత్రం సిక్కులు లక్ష్యంగా పూంఛ్‌ సెక్టార్‌లో గురుద్వారాలపై దాడులు చేస్తోంది. పాకిస్థాన్ బుధవారం రాత్రి గురుద్వారాపై చేసిన దాడుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు. భారత సామాన్య పౌరులపైనా పాకిస్థాన్ సైన్యం దాడులు చేస్తోంది’’ అని విక్రమ్ మిస్రీ తెలిపారు. 

‘‘ఎల్‌ఓసీ వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఏప్రిల్ 22 నుంచి కొనసాగుతున్నాయి. అక్కడ మోర్టార్లు, భారీ ఆయుధాలతో పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. ఈ దాడుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు’’ అని ఆయన వివరించారు.

‘‘తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాకిస్థాన్ చెప్పుకుంటోంది. పహల్గాం ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్‌తో లింకులున్న ది రెసిస్టన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌) రెండుసార్లు ప్రకటించింది. టీఆర్‌ఎఫ్‌ అనేది లష్కరే తోయిబా ముసుగు సంస్థ. దీనిపై తగిన ఆధారాలను భారత్‌ ఇప్పటికే ఐరాసకు సమర్పించింది. టీఆర్‌ఎఫ్‌ గురించి ఐక్యరాజ్య సమితికి వివరించాం. కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని చెప్పాం’’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

‘‘అర్ధరాత్రి డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్‌పై దాడికి పాక్ యత్నించింది. అవంతిపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌‌, కపుర్తలా, జలంధర్‌, లూథియానా, ఆదంపూర్‌, బఠిండా, చంఢీగఢ్‌, నల్, ఫలౌడి, ఉత్తర్‌లయ్‌, బుచ్‌ ప్రాంతాలపైనా ఎటాక్ చేసేందుకు యత్నించింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంఛ్, మెందార్‌, రాజౌరి సెక్టార్లలో పాక్‌ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది’’ అని భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.