ఆపరేషన్ సిందూర్ లో రాజకీయాలకు తావులేదు 

ఆపరేషన్ సిందూర్ లో రాజకీయాలకు తావులేదు 

 పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదని, మ‌న దేశ భ‌ద్ర‌తే ముఖ్యమ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధ‌వారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. 

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇచ్చేలా భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఈ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

భారత రక్షణ రంగం లో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతమని, అన్ని విభాగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసిందని ఆయన వివరించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలని శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహారించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.  ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.  ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ  ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.
ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు.హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేయాలని చెప్పారు. 
హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయభార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ సెక్యూరిటీ మీద దృష్టి సారించాలని వివరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని హిస్టరీ షీటర్‌లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.