దేశవ్యాప్తంగా `ఆపరేషన్‌ అభ్యాస్‌’ మాక్‌డ్రిల్‌

దేశవ్యాప్తంగా `ఆపరేషన్‌ అభ్యాస్‌’ మాక్‌డ్రిల్‌
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు బుధవారం దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ కింద సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. దేశ రాజధాని నగరం దిల్లీతో సహా గుజరాత్‌, బిహార్‌, యూపీ తదితర రాష్ట్రాల్లో కొంత సమయం పాటు కరెంటు నిలిపివేసి మాక్​ డ్రిల్స్‌ నిర్వహించారు. గ్రిడ్‌ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో ఈ మాక్ డ్రిల్​ చేపట్టారు.

ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత త్రివిధ దళాలు పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన కొన్ని గంటలకే మాక్‌ డ్రిల్స్‌ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 55 ప్రాంతాల్లో ఈ డ్రిల్స్‌ నిర్వహించారు. నగరమంతటా పోలీసు వాహనాలు, అగ్నిమాపక శకటాలను మోహరించారు.  డ్రిల్‌ ప్రారంభం కాగానే సైరన్లు మోగాయి, వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గాయపడిన వారిని స్ట్రెచర్ల మీద దవాఖానలకు తరలించారు.

ఇక పలు బహుళ అంతస్తుల భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళాలు క్రేన్లను ఉపయోగించాయి. ఘటనా స్థలాలకు డాక్టర్లు, అంబులెన్స్‌లు పరుగులు తీశాయి. సైరన్‌ మోగగానే కార్యాలయాల్లో ఉద్యోగులు విద్యుత్తు పరికరాలను ఆపివేసి డెస్క్‌ల కింద చేరి దాక్కున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 300 ప్రదేశాల్లో ఈ డ్రిల్స్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సున్నిత ప్రాంతాలైన అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, రిఫైనరీలు, జలవిద్యుత్తు కేంద్రాలకు పూర్తి భద్రత కల్పించారు. రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌), ప్రభుత్వ రైల్వే పోలీస్‌ (జీఆర్పీ) వేర్వేరుగా, సంయుక్తంగా ఈ డ్రిల్స్‌ చేపట్టాయి. ప్రమాద స్థలి నుంచి ప్రజలను కాపాడే ప్రక్రియలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్సీసీ దళాలు కూడా తమ పాత్ర పోషించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి 8 గంటల నుంచి 8.15 వరకు విద్యుత్‌ సరఫరా (పవర్​ బ్లాక్​అవుట్​) నిలిపేశారు. దీనికి సహకరించాలంటూ అంతకుముందే స్థానికులకు దిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్​డీఎంసీ) విజ్ఞప్తి చేసింది. అయితే ఈ డ్రిల్ నుంచి ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతిభవన్‌, ప్రధానమంత్రి కార్యాలయం, మెట్రో స్టేషన్లు, తదితర ముఖ్య ప్రదేశాలను మినహాయించారు.

బిహార్‌ రాజధాని పట్నాలోనూ ఈ రోజు బ్లాక్‌అవుట్‌ పాటించారు. రాత్రి 7 గంటల నుంచి 10 నిమిషాల పాటు విద్యుత్ ను నిలిపివేశారు. ఆరు జిల్లాల పరిధిలోని నగరాల్లో విద్యుత్ నిలిపివేశారు. దీనితో అత్యంత రద్దీగా ఉండే డాక్‌ బంగ్లా ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గుజరాత్‌లోనూ ఈ రోజు రాత్రి 7.30 నుంచి 8.30 మధ్య పవర్‌ బ్లాక్‌అవుట్‌ పాటించారు. రాంచీలోని కొన్ని ప్రాంతాల్లోనూ కొంతసేపు విద్యుత్​ సరఫరా నిలిపివేశారు.

హిమాచల్​ప్రదేశ్‌ రాజధాని శిమ్లాలోనూ మాక్‌ డ్రిల్‌ చేశారు. లఖ్‌నవూలోని రిజర్వ్‌ పోలీస్‌లైన్స్‌లో నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా పర్యవేక్షించారు. వీటితోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ పవర్​ బ్లాక్​అవుట్​ మాక్​ డ్రిల్​ను చేపట్టారు.  రాత్రి సమయాల్లో వైమానిక దాడుల నుంచి కాపాడుకోవడంతోపాటు, ముందస్తు జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ మాక్​డ్రిల్​ నిర్వహించారు.

సాయంత్రం నాలుగు గంటలకు మాక్‌ డ్రిల్ ప్రారంభం కాగానే పలు ప్రాంతాల్లో 2 నిమిషాలపాటు సైరన్‌లు మోగాయి. ఈ మాక్‌ డ్రిల్స్‌లో ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. దాదాపు 54 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో అవి జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.