సూరేపల్లి సుజాత వాఖ్యలపై బిజెపి ఎమ్యెల్యేల ఆగ్రహం

సూరేపల్లి సుజాత వాఖ్యలపై బిజెపి ఎమ్యెల్యేల ఆగ్రహం
ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎమ్యెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలైన సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు.
 
‘‘సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని… యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు’’ అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో బుధవారం పోస్టు చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌ను ఎగతాళి చేసిన ప్రొ.సుజాత ముమ్మాటికి దేశ ద్రోహేనంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అంతేకాదు, తక్షణమే ఆమెను సస్పెండ్ చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని శాసనసభ బీజేపీ ఉపనాయకుడు  పాయల్ శంకర్, ఎమ్యెల్యేలు  రాజాసింగ్, పాల్వాయి హరీష్,  ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి రెడ్డిని డిమాండ్ చేశారు.  లేకుంటే, భారత సైనిక శౌర్యపరాక్రమాలను కించపరిచేందుకు అర్బన్ నక్సలైట్లకు అనుమతిచ్చినట్టే అవుతుందని స్పష్టం చేశారు.
 
పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దాయాది దేశంలోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తే, దానిని తప్పుబట్టేవిధంగా ప్రొఫెసర్ సుజాత వ్యవహరించడం దుర్మార్గం, ఇది ముమ్మాటికి దేశద్రోహమే అంటూ వారు మండిపడ్డారు.
 
ఆపరేషన్ సింధూర్  చేపట్టిన భారత సైన్యాన్ని అభినందిస్తూ కులమతాలకు అతీతంగా భారతీయులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, అర్బన్ నక్సలైట్లు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు.  టెర్రరిస్టులు మారణాయుధాలతో మనపై దాడి చేస్తుంటే, ఇలాంటి అర్బన్ నక్సలైట్లు ఆయుధాలు వాడకుండానే అంతకన్నా ఎక్కువే దేశంపై, దేశ సమగ్రతపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
దేశద్రోహ చర్యలకు పాల్పడే అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలి. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతారని బిజెపి ఎమ్యెల్యేలు హెచ్చరించారు. భారత సైన్యం చేపట్టే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాల్సిన సమయంలో, సైనికుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.