
భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష నౌక- గగన్ యాన్ ప్రయోగం 2027 మొదటి త్రైమాసికానికి వాయిదా పడింది. ఇది అసలు షెడ్యూల్ కంటే దాదాపు 5 సంవత్సరాలు ఆలస్యం కావడం గమనార్హం. ఎందుకంటే గగన్యాన్ కోసం చాలా సంక్లిష్ట టెక్నాలజీలను వాడాల్సి ఉంటుంది. “గగన్ యాన్ ప్రాజెక్ట్ మొదటి అన్ క్రూడ్ మిషన్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత 2026లో ఇలాంటివే మరో రెండు మిషన్లు జరుగుతాయి” అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు.
‘2027 మొదటి త్రైమాసికంలో వ్యోమగాములతో కూడిన గగన్యాన్ ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపే ముందు, హాఫ్-హ్యూమనాయిడ్ రోబోట్- వ్యోమమిత్రను ప్రయోగిస్తాం’ అని నారాయణన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో గగన్ యాన్ ప్రాజెక్ట్ను ప్రకటించారు. 2022 నాటికి భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే కరోనా సంక్షోభం రావడంతో వ్యోమగాముల శిక్షణ ఆలస్యమైంది. ఈ మిషన్ కు అవసరమైన కీలక సంకేతిక పరిజ్ఢానాలను అభివృద్ధి చేయడంలో ఉన్న సంక్లిష్టత కారణంగా ఈ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతూ ఉంది. దీనితో ఈ మిషన్ ను 2025లో జరపాలని ఇస్రో భావించింది. తరువాత దీనిని 2026కి వాయిదా వేశారు. తాజాగా దీనిని 2027 మొదటి త్రైమాసికానికి వాయిదా వేశారు.
గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు హ్యూమన్-రేటెడ్ లాంచ్ వెహికల్ ను అభివృద్ధి చేశారు. అలాగే ఎన్విరాన్మెంట్ కంట్రోల్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్లను కూడా నిర్మించారు. దీని ద్వారా 400 కి.మీ దూరంలోని లో ఎర్త్ ఆర్బిట్లోకి వ్యోమగాములను తీసుకెళ్లి, సురక్షితంగా వెనక్కి తీసుకువస్తారు. ఈ మిషన్ జరిగేటప్పుడు అంతరిక్ష నౌకలోని క్యాబిన్ పీడనం, తేమ, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత, వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణ వ్యవస్థలను నిర్వహించడానికి ఈసీఎల్ఎస్ఎస్ సహాయపడుతుంది.
“గగన్యాన్ మిషన్ చాలా సంక్లిష్టమైనది. మేము మొదటిసారి దీనిని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే 90 శాతం పని పూర్తయింది. త్వరలోనే ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది” అని నారాయణన్ తెలిపారు. భారత్ చేపడుతున్న ఈ గగన్ యాన్ కనుక విజయవంతం అయితే, రష్యా, అమెరికా, చైనా తర్వాత స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.
More Stories
మరో పాక్ దౌత్యాధికారిపై భారత్ వేటు
5 ఏళ్ల తర్వాత 720 మందితో కైలాస మానస సరోవర యాత్ర
భారత్ లో 257 యాక్టివ్ కరోనా కేసులు