అందరి చూపులు ఆ ఇద్ద‌రు మ‌హిళా అధికారులపై!

అందరి చూపులు ఆ ఇద్ద‌రు మ‌హిళా అధికారులపై!

పాకిస్థాన్ ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ ఆప‌రేష‌న్ సిందూర్ గురించి భార‌త స‌ర్కారు మీడియాకు వెల్ల‌డించింది. ఆ మీడియా స‌మావేశంలో విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిశ్రితో పాటు ఇద్ద‌రు మ‌హిళా ఆఫీస‌ర్లు పాల్గొన్నారు.  ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.

ఇద్ద‌రు మ‌హిళా ఆఫీస‌ర్ల‌తో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించి మ‌హిళా శ‌క్తిని భారత్ చాటింది. ఆప‌రేష‌న్‌కు సిందూర్ అని పేరు పెట్ట‌డంలో నిగూఢ అర్థం దాగి ఉన్న‌ది. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో భ‌ర్త‌లు కోల్పోయిన మ‌హిళ‌లు త‌మ సిందూరాన్ని కోల్పోయారు. ఆ మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తున్న రీతిలో సిందూర్ అనే పేరు పెట్టారు. విశ్వ‌స‌నీయ‌మైన ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా ఉగ్ర స్థావ‌రాల‌ను టార్గెట్ చేశామ‌ని, ఆ ఉగ్ర‌వాదులు సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి పాల్ప‌డ్డార‌ని, ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో పాకిస్థాన్ మిలిట‌రీ కేంద్రాల‌ను టార్గెట్ చేయ‌లేద‌ని క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి వెల్ల‌డించారు. మొత్తం 9 ఉగ్ర‌వాద క్యాంపుల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

వింగ్ క‌మాండ‌ర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ ప్ర‌తిదాడి అంశంలో భార‌త్ నిగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించింద‌ని, పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌లను ధీటుగా ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్తం అయి ఉన్నామ‌ని తెలిపారు. కల్నల్ సోఫియా కురేషిది గుజరాత్‌. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు, తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు.  ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయస్సు నుండే సైన్యం అంటే అనుంబంధం ఏర్పడింది.

1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాలలో సిగ్నల్ రెజిమెంట్‌లలో సేవలు అందించారు. సోఫియా ఖురేషి సాధారణ అధికారి కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌లో కల్నల్ ర్యాంక్‌ లో ఉన్నారు. 2016 మార్చిలో, ఆమె “ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18″లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.

ఈ విన్యాసం, భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది.  ఈ కార్యక్రమంలో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి, వీటిలో సోఫియా ఖురేషి ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపారు.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఎక్స్ పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తయిన పర్వతాలు, అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణాల్లో కూడా ఆమె సమర్థంగా యుద్ద హెలికాప్టర్లను నడపగలరు. చాలా రెస్క్యూ మిషన్స్ కు ఆమె నేతృత్వం వహించారు.

కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదలు వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆరో తరగతి నుంచి తనకు పైలెట్ అవ్వాలని ఆశ ఉండేదని ఒక సందర్భంలో వ్యోమికా చెప్పారు. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజినీరింగ్ చదివేటప్పుడే పైలెట్ అవ్వడానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. 

ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్ని కొన్ని సార్లు సెకన్లలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్లాలి. అయినా కూడా తను ఎక్కడా వెరవకుండా సేవలు అందిస్తున్నారు.