
తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకొన్న తొలిచర్యగా నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్లో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ములోని రాంబన్లో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్సుకు సాగునీరు అందడం లేదు.
ఉపగ్రహ చిత్రాలు దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ఝీలం నదిపై ఉన్న కిషన్గంగ జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా జమ్ము కశ్మీర్లోని డ్యామ్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే పనులను భారత్ వేగవంతం చేస్తోంది. బాగ్లిహార్, సలాల్ డ్యామ్లలో పూడికతీత పనులను భారత్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులను నిర్మించిన తర్వాత పూడికతీత పనులు చేపట్టడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఇలాంటి చర్యలపై పాకిస్థాన్ అభ్యంతరం చెప్పేది.
సింధునదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్కు చెప్పకుండానే ఇప్పుడు భారత్, డ్యాంల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్ పెంచుకునే వీలు ఉంటుంది. గత గురువారం నుంచి రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టింది. దాదాపు మూడు రోజులపాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ హెచ్ పిసి చూసుకుంటోంది.
ఇలాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అరడజను కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కూడా ఇదే విధంగా పూడికతీత పనులు భారత్ చేపడితే పాకిస్థాన్కు నీరు వెళ్లడం తగ్గుతుంది. పాకిస్థాన్లో వ్యవసాయ రంగం 80 శాతం సింధూ నదీ జలాలపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న చర్యలు దాయాదిపై పెను ప్రభావాన్ని చూపుతాయి.
బురద తొలగింపు పనుల కోసం డ్యాంలలో ఉన్న నీటిని ఒకేసారి కిందకు వదలాల్సి వస్తుంది. అందుకే ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు చీనాబ్ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. పాకిస్థాన్ వైపు వరద లాంటి పరిస్థితి సంభవించింది. సలాల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 690 మెగావాట్లు. బాగ్లిహార్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. సలాల్ డ్యామ్ను 1987లో, బాగ్లిహార్ను 2009లో ప్రారంభించారు.
అయితే వీటిలో బురద తొలగింపునకు గతంలో పాకిస్థాన్ ఒప్పుకోకపోవడం వల్ల వీటి సామర్థ్యం కంటే తక్కువగానే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడంలో పాక్తో సంబంధం లేకుండానే ఈ ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను భారత్ చేపట్టింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో గతంలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా కేంద్రం వేగవంతం చేయాలని భావిస్తోంది.
ఈ ఆరు పూర్తయిన తర్వాత, జమ్ము కశ్మీర్ 10 వేల మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాక్కు కేటాయించిన మూడు నదుల్లో విద్యుత్ ఉత్పత్తి డ్యాంలను మాత్రమే నిర్మించే అవకాశం భారత్కు ఉండేది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టడంతో భారత్ పెద్ద ఎత్తున నీటి నిల్వ ప్రాజెక్టులు చేపట్టవచ్చు.
సింధూ జలాల ఒప్పందం అమల్లో లేకపోవడం వల్ల పాక్కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్కు లేదు. మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి కుష్వీందర్ వోహ్రా పేర్కొన్నారు.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం