పాకిస్తాన్ నటుడికి మద్దతుగా వివాదంలో ప్రకాష్ రాజ్

పాకిస్తాన్ నటుడికి మద్దతుగా వివాదంలో ప్రకాష్ రాజ్
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పాలని మొత్తం దేశ ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారు.  పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా గ‌ట్టి డిమాండ్ వినిపిస్తోంది. పాకిస్థాన్ నేతలకు సంబందించిన సోషల్ మీడియా అకౌంట్ లపైననే కాకుండా క్రీడాకారులు, నటుల ఖాతాలపై కూడా భారత్ లో ఆంక్షలు విధిస్తున్నారు. 

అటువంటి సమయంలో ఎప్పటికప్పుడు బీజేపీకి వ్య‌తిరేఖంగా మాట్లాడే ప్రముఖ నటుడు ప్ర‌కాశ్ రాజ్ తరచూ వివాదాస్ప‌ద వా ఖ్యలతో  వార్తలలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ స్టార్ నటుడు తాజాగా పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం వివాదం సృష్టిస్తోంది.

పహల్గాం దాడి త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం పాకిస్తాన్ పై అన్ని రకాలుగా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నది. ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాటు, వారికి భారత్  నుంచి రావల్సిన నీటిని కూడా ఆపేసింది. ఛానెల్స్, సోష‌ల మీడియా, సినిమాలు ఇలా అన్నింటిని నిషేధించింది. విషయాలను రద్దుచేసి పాకిస్తానీయుల‌ని కూడా ఈ దేశం నుండి పంపేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఇక పాకీస్తాని నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం , వారి సినిమాల‌ను బాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జ‌రిగింది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ పాక్ హీరో సినిమా విడుదలను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను భారత్ లో నిషేధించడాన్ని ప్రకాష్ రాజ్ తప్పు పట్టారు.

“పోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేదించ‌డం నాకు స‌రిగ్గా అనిపించ‌డం లేదు. ముందు సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు పాక్ న‌టుల సినిమాలు చూస్తారా? లేదా? అనేది తెలుస్తుంది. విడుదల చేసి ఆ ఫ‌లితాన్ని వారికే వ‌దిలేస్తే మంచిది” అంటూ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌కాశ్ రాజ్. 

ఆయ‌న పాక్ న‌టుల‌కి మద్దతు ఇవ్వ‌డాన్ని నెటిజ‌న్స్ తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. కాగా, పహల్గాం దాడి తరువాత వారి చర్యను ఖండిస్తూ ప్రకాశ్ రాజ్ సుదీర్ఘ‌మైన నోట్ విడుద‌ల చేశారు. “ఇటువంటి పనులు మా దేశం చేయదు, దేశ పౌరులు అంతకన్నాచేయరు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించవద్దు” అంటూ పాకిస్తాన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.