భారత్‌పై దాడికి ప్రయత్నించేవారికి సరైన సమాధానం

భారత్‌పై దాడికి ప్రయత్నించేవారికి సరైన సమాధానం
భారత్‌పై దాడికి ప్రయత్నించేవారికి సరైన సమాధానం చెబుతామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. దేశ సరిహద్దుల భద్రతతో పాటు సైనికులను కాపాడుకోవడం రక్షణమంత్రిగా తన బాధ్యత అని అయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పనితీరు. పట్టుదల గురించి అందరికీ ఈ విషయం తెలుసునని, ఆయన నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది కచ్చితంగా జరుగుతుందని, ఈ విషయంలో తాను హామీ ఇస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సంస్కృతి జాగరణ్‌ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ  సైనికులు దేశ భౌతిక స్వరూపాన్ని కాపాడుతున్నారని, మరో వైపు రుషులు, జ్ఞానులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. ఓ వైపు సైనికులు యుద్ధ భూమిపై పోరాడుతుంటే, సాధువులు జీవన భూమిపై పోరాడుతున్నారని చెప్పారు. 
 
దేశ సరిహద్దుల భద్రతతో పాటు సైనికులను కాపాడడం తన బాధ్యత అని, దేశంపై దాడికి ప్రయత్నించేవారికి సరైన రీతిలో సమాధానం ఇవ్వడం తన విధి అని తేల్చి చెప్పారు. భారత్‌ శక్తి సాయుధ దళాల్లోనే కాకుండా, సంస్కృతి, ఆధ్యాత్మికతలోనూ ఉందని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.
‘‘రక్షణ మంత్రిగా… నా సైనికులతో కలిసి పనిచేయడం నా బాధ్యత. దేశ సరిహద్దులను కాపాడటం నా బాధ్యత. మన దేశంపై కన్నెత్తి చూసేవారికి సాయుధ బలగాలతో కలిసి తగిన సమాధానం ఇవ్వడం నా బాధ్యత’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.  ఇది చిన్న లక్ష్యం కాదని పేర్కొంటూ ప్రపంచంలో భారతదేశం ప్రతిష్ట పెరిగిందనే వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తారని, ఈ కాబట్టి ఈ లక్ష్యం సాధ్యమవుతుందని భరోసా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ఢిల్లీలో జపాన్‌ రక్షణ మంత్రి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులపై చర్చించడం, ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.  భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సమయంలోనే ఈ భేటీ జరుగనున్నది. భారత్‌-జపాన్‌ మధ్య ఇప్పటికే మంచి స్నేహం ఉన్నది. ఇద్దరు నేతలు చివరిసారిగా గతేడాది నవంబర్‌లో లావో పీడీఆర్‌లో జరిగిన ఏషియన్‌ రక్షణమంత్రుల సమావేశంలో కలిశారు. ఆ సమయంలో ద్వైపాక్షిక రక్షణ, సాంకేతిక సహకారంపై చర్చించారు.