విజయవాడకు సమీపం కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్

విజయవాడకు సమీపం కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్
విజయవాడకు సమీపంలో కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతోంది. జూన్ నెల నుంచి ఐదు, ఆరో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి.  తాజాగా విజయవాడ సమీపంలోని కేతనకొండలో నాలుగోది ఏర్పాటు కానుంది.
విద్యా భారతి ఆధ్వర్యంలో నేతాజీ సైనిక్ స్కూలు పేరుతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ కార్యనిర్వాహక కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి చెప్పారు.  సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన బ్రోచర్లను స్థల, భవన దాత చలసాని బాబూ రాజేంద్రప్రసాద్, నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ కార్యదర్శి వాసిరెడ్డి వినోద్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో కలిసి ఆవిష్కరించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 67 శాతం మందికి స్థానిక కోటా కింద ఈ పాఠశాలల్లో ఇస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు చెప్పారు.  ఆరో తరగతిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆలిండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు అవకాశం ఉంటుందని చెప్పారు.  జూన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, బండి సంజయ్ చేతులమీదుగా నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. 

“కేంద్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో 100 సైనిక్ స్కూళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎనిమిది ఎకరాల భూమి, భవనాలు చూపించి, సైనిక్ స్కూల్కి మేము దరఖాస్తు చేశాము. కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి, పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసి, సైనిక్ స్కూల్ కేటాయించారు” అని సుధాకర్ రెడ్డి తెలిపారు.  “ఇది ఆంధ్రప్రదేశ్లో నాలుగో సైనిక్ స్కూల్ అవుతుంది. తెలంగాణ వాళ్లు కూడా ఇక్కడ చేరవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టే పరీక్ష ద్వారా ఆరో తరగతిలో విద్యార్థులు జాయిన్ అవుతారు. మేము ఇక్కడ 5వ తరగతికి కూడా విద్యార్థులను తీసుకుంటున్నాము. వీరికి వచ్చే సంవత్సరం పెట్టే పరీక్ష కోసం ట్రైనింగ్ ఇస్తాము” అని ఆయన వివరించారు.