తిరుమలలో నూతన వీఐపీ బ్రేక్‌ దర్శనాలు

తిరుమలలో నూతన వీఐపీ బ్రేక్‌ దర్శనాలు

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో తాజాగా చేసిన మార్పులు శనివారం అమల్లోకి వచ్చాయి. గత ప్రభుత్వం నుంచి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే క్రమంలో ప్రస్తుత పాలకమండలి ప్రయోగాత్మకంగా ఈ మార్పులు చేపట్టింది. గతంలో గురు/శుక్రవారాల్లో ఉదయం 7.30 గంటల నుంచి మిగిలిన రోజుల్లో 8.30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1.30 గంటలు దాటినా వరుసగా బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి, దాతలు, ఉద్యోగుల దర్శనాలు కొనసాగేవి.

దీంతో ఉదయం క్యూలైన్‌లోకి వచ్చిన సర్వదర్శనం, రూ.300 ఎస్‌ఈడీ భక్తులు ఇబ్బంది పడేవారు. దీంతో టీటీడీ పాలకమండలి పలు మార్పులు చేపట్టింది. మే 1వ తేదీ నుంచి నూతన వేళలు అమలు చేయాల్సి ఉన్నా గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం నేపథ్యంలో యథావిధిగా కొనసాగించారు. శనివారం మొదటి రోజు 2 విడతలుగా బ్రేక్‌ విధానం అమలు చేశారు. మొదట ఉదయం 6.20 నుంచి 8.30 వరకు వీఐపీ ప్రొటోకాల్, రెఫరల్, జనరల్‌ బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం కల్పించారు.

ఈలోగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న సామాన్య భక్తులను దర్శనాలకు వదిలారు. నైవేద్య విరామం పూర్తికాగానే 10.20 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, దాతలు, టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు దర్శనం కల్పించారు. గతంతో పోల్చుకుంటే 4.30 గంటల్లోపే వీఐపీ బ్రేక్‌ ముగించినట్లయింది.  మధ్యలో సర్వదర్శనాలు అనుమతించడంతో సామాన్య భక్తులకు 1.45 గంటల పాటు సమయం కలిసి వచ్చినట్లయింది. దీంతో అదనంగా ఏడు వేల మంది భక్తులకు సర్వదర్శనం లభించింది. వేళల మార్పుపై మరో 2, 3 రోజులు పరిశీలించి తర్వాత కొనసాగించనున్నారు.