ఉద్రిక్తలు తగ్గించుకొండి.. భారత్, పాక్ లకు అమెరికా హితవు

ఉద్రిక్తలు తగ్గించుకొండి.. భారత్, పాక్ లకు అమెరికా హితవు
పెహల్‌గామ్‌ ఉగ్రదాడితో భారత్‌- పాకిస్థాన్ లమధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో తాజా పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు అగ్రరాజ్యం అమెరికా ఉద్రిక్తలను తగ్గించుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో ఫోన్‌లో విడివిడిగా మాట్లాడారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం ఉంటుందని జైశంకర్‌ కు రుబియో హామీఇచ్చారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకొని, దక్షిణాసియాలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇక పాక్‌ ప్రధానితో మాట్లాడిన రుబియో పెహల్‌గామ్‌ ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 

ఈ దాడిపై దర్యాప్తునకు పాక్‌ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో ప్రత్యక్ష చర్చలు జరపాలని సూచించారు. అయితే, కాశ్మీర్ వివాదం భారత్ – పాకిస్తాన్ ల మధ్య 1000 నుంచి 1500 ఏళ్లుగా కొనసాగుతుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వాఖ్యలపై విమర్శలు తలెత్తుతూ ఉండడంతో అమెరికా ఈ సూచనలు చేసినట్లు కనిపిస్తుంది. 

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల మార్కో రుబియో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భారత్‌కు ఉగ్రవాదం పై పోరాటంలో అమెరికా మద్దతు ఉంటుంది తెలిపారు. అయితే, ఉగ్రదాడి వెనుకు పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తోన్న భారత్ ప్రతీకార దాడి చేయాలన్న ఆలోచనకు బదులు జాగ్రత్తగా వ్యవహరించాల సూచించారు.  దీనికి జైశంకర్ స్పందిస్తూ “దాడిలో పాత్రధారులు, సూత్రధారులు, మద్దతుదారులు న్యాయస్థానంలో నిలబడాల్సిందే. దోషులు శిక్ష ఎదుర్కోవాల్సిందే” అని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 

ఏప్రిల్ 22న కశ్మీర్‌లో జరిగిన దాడిని పాకిస్థాన్ ఖండించాలని రుబియో కోరారు. దాడిపై నిష్పక్షపాత విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు.  భారత్‌తో కలిసి ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి, నేరుగా సంభాషణలను పునరుద్ధరించి, దక్షిణ ఆసియాలో శాంతిని నెలకొనడానికి ప్రయత్నించాలని సూచించారు. ‘ఈ అమానుష దాడి విషయంలో పాకిస్థానీ అధికారుల సహకారం చాలా అవసరం’ అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు.
 
అంతకు ముందు పహల్గామ్ ఉగ్రదాడిని అధ్యక్షుడు ట్రంప్,  ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు తీవ్రంగా ఖండించారు. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికాను భారత్ కీలక భాగస్వామిగా భావిస్తోంది. కానీ, పాకిస్థాన్‌పై బహిరంగ విమర్శలు దిగకుండా నెమ్మదిగా ఉద్రిక్తతలను తగ్గించాలన్న దిశగా అమెరికా ప్రోత్సహిస్తోంది.
 
ఒకప్పుడు అమెరికాకు పాక్ మిత్ర దేశం అయినా 2021లో అఫ్గన్ నుంచి నాటో బలగాలు వెనక్కు వెళ్లిన తర్వాత దాని ప్రాధాన్యత తగ్గింది. పహల్గామ్ దాడికి పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో అనుబంధం ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత వహించడంతో దాయాది పాత్రపై భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో పాక్‌పై దౌత్యపరమైన ఆంక్షలు విధించిది.