చీనాబ్ న‌దిలో పాకిస్థాన్‌కు త‌గ్గిన నీటి ప్ర‌వాహం

చీనాబ్ న‌దిలో పాకిస్థాన్‌కు త‌గ్గిన నీటి ప్ర‌వాహం

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో సిందూ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ నిలిపి వేయడంతో చీనాబ్ న‌దిలో నీటి ప్ర‌వాహం త‌గ్గిన‌ట్లు గుర్తిస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇండియా నుంచి పాకిస్థాన్‌లోకి చీనాట్ న‌ది ప్ర‌వ‌హిస్తుంది. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ వ‌ద్ద ఉన్న మ‌ర‌లా హెడ్‌వ‌ర్క్స్ బ్యారేజీ వ‌ద్ద నీటి ప్ర‌వాహాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా ప‌సిక‌ట్టారు. 

ఒప్పందాన్ని స‌స్పెండ్ చేయ‌డానికి ముందు ఏప్రిల్ 21వ తేదీన ఉన్న నీటి స్థాయిని, ఆ త‌ర్వాత ఏప్రిల్ 26వ తేదీన బ్యారేజీ వ‌ద్ద ఉన్న నీటి స్థాయిని శాటిలైట్ చిత్రాల ద్వారా విడుదల చేశారు.  ఏప్రిల్ 26 త‌ర్వాత బ్యారేజ్ వ‌ద్ద ఎక్కువ‌గా బురుద‌, రాళ్లు పేరుకుపోయిన‌ట్లు గుర్తించారు. vమ‌ర‌లా హెడ్‌వ‌ర్క్స్ వ‌ద్ద కొన్ని ప్రాంతాల్లో నీటి స్థాయి పూర్తిగా ప‌డిపోయింద‌ని, శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విష‌యం స్ప‌ష్టం అవుతున్న‌ట్లు క‌ల్న‌ల్ వినాయ‌క్ భ‌ట్ తెలిపారు.

శాటిలైట్ చిత్రాల‌ను విశ్లేషించే ఆయ‌న వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. సింధూ జ‌లాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఇండియాలో చీనాబ్ న‌ది నీటి స్టోరేజీ పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. చంద్ర‌, భాగా న‌దులు క‌లిసిన త‌ర్వాత చీనాబ్ న‌దిగా మారుతుంది. మ‌నాలీ, లేహ్ రూట్లో ఉన్న బ‌రాలాచా లా పాస్ వ‌ద్ద ఆ న‌దులు క‌లుస్తాయి. చంబా మీదుగా నార్త్ వెస్ట్ రూట్లో చీనాబ్ నీరు జ‌మ్మూక‌శ్మీర్‌లోకి ప్ర‌వేశిస్తుంది. కిస్టావ‌ర్‌, దోడా, రాంబ‌న్‌, రియాసీ, జ‌మ్మూ జిల్లాల మీదుగా ఆ న‌ది ప్ర‌వ‌హిస్తుంది. 

ఆ త‌ర్వాత పాకిస్థాన్‌లోని బ‌వ‌ల్‌పుర్‌లో స‌ట్ల‌జ్ న‌దిలో క‌లుస్తుంది. ఈ న‌దిపై హైడ్రో ప‌వ‌ర్‌ను అధిక స్థాయిలో ఉత్ప‌త్తి చేస్తున్నారు. భార‌త్ వైపునే సుమారు ఏడు వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తున్నారు. పాకిస్థాన్ వైపు చీనాబ్ న‌దిపై ఉన్న మ‌ర‌లా హెడ్‌వ‌ర్క్స్ బ్యారేజీ ఆక్నూర్ సెక్టార్‌లోని అంత‌ర్జాతీయ బోర్డ‌ర్‌కు 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. 

దీనిపై ప్ర‌ధానంగా రెండు ఇరిగేష‌న్ లింకు కెనాల్స్ ఉన్నాయి. మ‌ర‌లా-రావి లింక్ కింద సుమారు 22 వేల క్యూసెక్కుల నీరు ప్ర‌వ‌హిస్తుంది. ఇక బంబ‌న్‌వాలా-రావి-బెడియాన్-దీపాల్‌పుర్ కెనాల్ కింద సుమారు 4200 క్యూసెక్కుల నీరు ప్ర‌వ‌హిస్తుంది. ఈ కెనాల్‌నే ఇచోగిల్ కెనాల్ అని కూడా పిలుస్తారు. హెడ్‌వ‌ర్క్స్‌, ఎంఆర్ఎల్ బ్యారేజీల‌ను బ్రిటీష్ కాలంలో నిర్మించారు. 

1906 నుంచి 1912 మ‌ధ్య‌లో వీటిని క‌ట్టారు. పాకిస్థాన్‌లో ఉన్న గుర్జ‌న్‌వాలా ప్రాంతానికి నీరు వెళ్తుంది. ఇక్క‌డ ప్ర‌వ‌హించే నీటికి మిలిట‌రీ ప్రాముఖ్య‌త కూడా ఉంటుంది. పాకిస్థాన్‌లో ఉన్న ఎక్కువ ఆర్మీ యూనిట్లు అన్నీ ఇక్క‌డ కెనాల్స్‌పై ఆధార‌ప‌డుతుంటాయ‌ని ర‌క్ష‌ణ‌శాఖ నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. నీటి ప్ర‌వాహం త‌గ్గ‌డం వ‌ల్ల అది సైనిక స‌త్తాపై నేరుగా ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.