కెనడాలో అధికార లిబరల్ పార్టీకే పట్టం

కెనడాలో అధికార లిబరల్ పార్టీకే పట్టం
* ట్రంప్‌ బెదిరింపులకు భయపడొద్దు… మోదీ అభినందనలు
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్‌ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. కెనడా ప్రజలు వరుసగా నాలుగోసారి ఆ పార్టీకే పట్టం కట్టారు. దాంతో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీనే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దాంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది.
కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. కెనడా పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యుల బలం అవసరం.  అయితే లిబరల్‌ పార్టీకి 167 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే మరో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే మరో ఐదు సీట్లు తక్కువయ్యాయి. లిబరల్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో మార్క్‌ కార్నీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఎన్నికల్లో విజయం ఖాయమైన అనంతరం కార్నీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కెనడా ప్రజల్లో విభేదాలు సృష్టించి, విచ్ఛిన్నం చేసి దేశాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా సుంకాలు విధిస్తోందని, కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. 
 
కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని, ట్రంప్‌ బెదిరింపులకు భయపడవద్దని పిలుపునిచ్చారు.  ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో మనమే గెలుస్తామని కార్నీ కెనడా ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికా మనకు చేస్తున్న ద్రోహాన్ని ఎన్నటికీ మరిచిపోవద్దని, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా కెనడా అనుసరిస్తున్న ఐక్యత, అభివృద్ధి తదితర విలువలను తాను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కొన్ని నెలలు సవాలుగా ఉండొచ్చని, అయినప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని కార్నీ పేర్కొన్నారు
 
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్‌ కార్నీ, ఆయన లిబరల్‌ పార్టీకి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా నాలుగోసారి అధికారం దక్కించుకున్న లిబరల్‌ పార్టీని అభినందించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య క్షీణించిన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన మార్క్ కార్నీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ఫ్రాంకోయిస్‌ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్‌ క్యూబికాయిస్‌ పార్టీ 23 స్థానాల్లో గెలిచింది. ఇక ఖలిస్థానీలకు అనుకూలుడైన జగ్మీత్‌ సింగ్‌కు చెందని ఎన్‌డీపీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ జగ్మీత్‌ సింగ్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

అమెరికాతో సుంకాల యుద్ధానికి తోడు, కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్‌ బెదిరిస్తున్న వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దాంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఈ ఏడాది జనవరిలో జస్టిన్‌ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్‌ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్‌ కార్నీని ఎన్నుకున్నారు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాంతో ఎన్నికల క్రతువు అంతా పూర్తయ్యి ఏప్రిల్‌ 28న పోలింగ్‌ జరిగింది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు.