పహల్గాం ఉగ్రదాడిలో హమాస్‌ హస్తం?

పహల్గాం ఉగ్రదాడిలో హమాస్‌ హస్తం?

* మాట మార్చిన ఆర్‌టీఎఫ్, విచారణకు సిద్ధం అంటున్న పాక్ ప్రధాని!

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ టెర్రరిస్టులకే కాక మరికొందరి హస్తం కూడా ఉంచవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడి తరహాలోనే ఇప్పుడు పహల్గాంలో కూడా దాడి జరిగినట్టు పోలికలు కన్పించడంతో పాటు, గత ఏడాది కాలంలో హమాస్‌కు చెందిన పలువురు సీనియర్‌ నేతలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను సందర్శించినట్టు వెలుగులోకి రావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 
 
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం జైషే మహమ్మద్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న బహల్వపూర్‌ను హమాస్‌ బృందం ఇటీవల సందర్శించింది. కశ్మీర్‌ సంఘీభావ దినం సందర్భంగా పీవోకేలోని రావల్‌కోట్‌లో జరిగిన ర్యాలీలో హమాస్‌ నేతలు ప్రసంగించారు. ఎల్‌ఈటీ, జైషే మహ్మద్‌ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే పహల్గాం దాడి విషయంలో వీరి హస్తం, సహకారం కూడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ సంచలన ప్రకటన చేసింది. మొదట ఈ దాడి తమ పనే అని ప్రకటించుకున్న ఆర్‌టీఎఫ్ ఇప్పుడు మాట మార్చింది. పెహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది. ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

తమ వ్యవస్థలి భారత్‌ హ్యాక్‌ చేసినట్లు ప్రకటనలో ఆరోపించింది. ‘పెహల్‌గామ్‌ ఘటనలో మా ప్రమేయం లేదు. ఈ చర్యను టీఆర్‌ఎఫ్‌కు ఆపాదించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో కూడా మాకు సంబంధం లేదు. భారత్‌ మా వ్యవస్థల్ని హ్యాక్‌ చేసి ఆ మెసేజ్‌ పోస్ట్‌ చేసింది. ఇది భారత సైబర్‌-ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌ల పని. దీనిపై మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు’ అంటూ ఆరోపించింది.

మరోవంక, పహల్గాం దాడి తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది. దీనితో పాకిస్థాన్‌పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.