కాశ్మీర్‌ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత

కాశ్మీర్‌ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
* నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులు
పెహల్‌గామ్‌ దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్‌ లోయలో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాళు ధ్వంసం చేస్తున్నాయి.  తాజాగా జమ్ము కశ్మీర్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు పేల్చేశాయి. 
షోపియాలోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్‌ షాహిద్‌ అహ్మద్‌ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. అదేవిధంగా కుల్గాంలోని మతాలం ప్రాంతంలో టెర్రరిస్ట్ జాహిద్‌ అహ్మద్‌ నివాసంతోపాటు ఇదే జిల్లాలో లష్కరే ముఠాకు చెందిన మరో ఉగ్రవాది అహ్మద్‌ షేక్‌ నివాసాన్ని పేల్చేశాయి.  కుల్గాంలోని ముర్రా ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్‌ ఉల్‌ హక్‌ ఇల్లు, పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో ముష్కరుడు హరీస్‌ అహ్మద్‌ ఇంటిని బాంబులతో పేల్చేశాయి. అయితే, భద్రతా బలగాలకు టెర్రరిస్టుల ట్రాప్‌ చేయగా, ఈ ట్రాప్‌ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది.
 
శుక్రవారం ఉదయం పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్‌ ఫౌజీ దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళాలు వస్తాయని ఊహించి వారు రాగానే యాక్టివేట్‌ అయ్యేలా ఐఈడీలు ఉంచాడు. అతను ఊహించినట్టే ఇంటిని తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెళ్లారు. వారు ఇంట్లోకి రాగానే పేలుడు పదార్థాలు యాక్టివ్‌ అయ్యాయి. 
 
ఇది గుర్తించిన పోలీసులు వెంటనే బయటకు వచ్చిన కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. మరో ఉగ్రవాది ఆదిల్‌ థోకర్‌ ఇంట్లో కూడా ఇలాగే బాంబు ద్వారా ట్రాప్‌ పెట్టినా పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్లతో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.  మరోవంక, పాకిస్థాన్‌ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతున్నది. గురువారం రాత్రి జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ  వెంబడి భారత సైనికులపై కాల్పులు జరిపిన పాక్‌ ఆర్మీ మరోసారి అత్యుత్సహాన్ని ప్రదర్శించారు.

ఏప్రిల్‌ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్‌ ఆర్మీ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఏప్రిల్‌ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్‌ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపింది. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టామని అధికారులు తెలిపారు.

“శుక్రవారం రాత్రి కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు లేకుండా పాకిస్థాన్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత దళాలు కూడా అదే స్థాయిలో స్పదించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు” అని ఓ ప్రకటనలో వెల్లడించింది. గురువారం రాత్రి కూడా జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్‌ సైనికులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. వీటిని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని సైనిక వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని పారామిలిటరీ దళాలకు రక్షణ శాఖ సెలవులు రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జమ్ములోని సుచేత్‌గఢ్‌ వద్ద భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దును పౌరులకు మూసివేశారు. సుచేత్‌గఢ్‌లోని ఆక్ట్రాయ్‌ పోస్టు వద్ద పౌర కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది(బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం నిలిపివేసింది. 

పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దు వెంబడి ఉన్న అటారీ, హుస్సేనీవాలా, సడ్కీ వద్ద రిట్రీట్‌ కవాతులను రద్దు చేసినట్లు బీఎస్‌ఎఫ్‌ ప్రకటించిన నేపథ్యంలో సుచేత్‌గఢ్‌ వద్ద తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుచేత్‌గఢ్‌లో కూడా రిట్రీట్‌ కవాతు జరగడం సంప్రదాయంగా వస్తోంది. భారత అంతర్జాతీయ సరిహద్దు ఉత్తరాన జమ్ము నుంచి ప్రారంభమై పంజాబ్‌, రాజస్థాన్‌ మీదుగా పశ్చిమాన గుజరాత్‌ వరకు వెళుతుంది. 

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమన్న భారత్‌ సంకల్పాన్ని తాజా పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌ పరిస్థితులపై చర్చించడానికి అన్ని సైనిక విభాగాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు మోహరించాయి. శ్రీనగర్‌లోని విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీరులో పరిస్థితిని సమీక్షించేందుకు భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్‌ చేరుకున్నారు.