
ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపింది. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టామని అధికారులు తెలిపారు.
“శుక్రవారం రాత్రి కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు లేకుండా పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత దళాలు కూడా అదే స్థాయిలో స్పదించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు” అని ఓ ప్రకటనలో వెల్లడించింది. గురువారం రాత్రి కూడా జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. వీటిని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని సైనిక వర్గాలు వెల్లడించాయి.
దేశంలోని పారామిలిటరీ దళాలకు రక్షణ శాఖ సెలవులు రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జమ్ములోని సుచేత్గఢ్ వద్ద భారత్-పాకిస్థాన్ సరిహద్దును పౌరులకు మూసివేశారు. సుచేత్గఢ్లోని ఆక్ట్రాయ్ పోస్టు వద్ద పౌర కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది(బీఎస్ఎఫ్) శుక్రవారం నిలిపివేసింది.
పంజాబ్లోని భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న అటారీ, హుస్సేనీవాలా, సడ్కీ వద్ద రిట్రీట్ కవాతులను రద్దు చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించిన నేపథ్యంలో సుచేత్గఢ్ వద్ద తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుచేత్గఢ్లో కూడా రిట్రీట్ కవాతు జరగడం సంప్రదాయంగా వస్తోంది. భారత అంతర్జాతీయ సరిహద్దు ఉత్తరాన జమ్ము నుంచి ప్రారంభమై పంజాబ్, రాజస్థాన్ మీదుగా పశ్చిమాన గుజరాత్ వరకు వెళుతుంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమన్న భారత్ సంకల్పాన్ని తాజా పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ పరిస్థితులపై చర్చించడానికి అన్ని సైనిక విభాగాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు మోహరించాయి. శ్రీనగర్లోని విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీరులో పరిస్థితిని సమీక్షించేందుకు భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
మరో పాక్ దౌత్యాధికారిపై భారత్ వేటు
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు