ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్‌ పై పోలీసుల డేగకన్ను

ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్‌ పై  పోలీసుల డేగకన్ను
* విజయవాడలో 10 మంది సిమి ఉగ్రవాదులు?
పహల్గాంలో ఉగ్రదాడి, తదనంతర పర్యావసనాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర నిఘా వర్గాల సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖ అలెర్ట్‌ అయ్యింది. అనుమానితులు, నిషేధత జాబితాలోని సంస్ధల్లో గతంలో పనిచేసిన వ్యక్తులు, ఇతర దేశాల నుంచి గడువు పూర్తయినా ఇక్కడే ఉండిపోయిన వ్యక్తులతో పాటు పలువురిపై ఇంటెలిజెన్సీ వర్గాలు డేగ కన్ను వేశాయి. ముఖ్యంగా పట్టణాల్లో స్లీపర్‌సెల్స్‌ పై ఆరా తీసే పనిలో పోలీస్‌ శాఖ నిమగమైంది. ముఖ్యంగా పోలీస్‌ శాఖ జనాబా రద్దీగా ఉండే ప్రాంతాలు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం.
 
కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పాకిస్ధాన్‌కు చెందిన వారందరినీ ఈనెల 27లోగా వారి దేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కూడా పోలీస్‌ శాఖ, నిఘా వర్గాలు, స్పెషల్‌ బ్రాంచ్‌ వర్గాలు పాకిస్తానీయులను గుర్తించే గుర్తించే పనిలో పడినట్లు సమాచారం. 
 
విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల భద్రతపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖ పట్టణాలపై కూడా కేంద్ర ఇంటెలిజెన్సీతో పాటు రాష్ట్రానికి చెందిన నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. విజయవాడ పట్టణంలో పోలీస్‌ కమషనర్‌ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. 
 
కమిషనరేట్‌ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసింగ్‌ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాత్రి గస్తీని కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీస్‌ బృందాలను, పోలీస్‌ వాహనాలను ఏర్పాటు చేశారు.
రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు, లాడ్జీలు, హోటళ్లు, పట్టణ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
గస్తీ ముమ్మరం చేయడంలో భాగంగా నెంబరు ప్లేట్‌ లేని వాహనాలు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
విజయవాడలో నిషేధిత సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సానుభూతిపరుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు నగరంలో పది మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.  సుమారు రెండు నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు నలుగురు అనుమానిత సిమి సానుభూతిపరులకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు, తమదైన శైలిలో దర్యా ప్తును ముమ్మరం చేసి, మరో ఆరుగురు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం.  దీంతో మొత్తం పది మంది వ్యక్తుల కదలికలపై నిఘా వ్యవస్థను కేంద్రీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ పది మంది అనుమానితులు నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట వంటి ప్రాంతాలలో నివాసం ఉంటున్నారని, వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది.  అయితే, ఇప్పటి వరకూ వీరి నుంచి ఎలాంటి చట్టవ్యతిరేక లేదా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి రాలేదని, అయినప్పటికీ వీరిపై నిఘాను నిరంతరం కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గతంలో విజయవాడ నగరం మావోయిస్టులకు సైతం కీలకమైన షెల్టర్ జోన్‌గా నిలిచిన అనుభవాలున్నాయి.  ఈ నేపథ్యంలో తాజా సమాచారంతో భద్రతా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితిని నిశితంగా గమ నిస్తున్నామని, అనుమానితులపై నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో 1946 ఫారినర్స్‌ చట్టం సెక్షన్‌3(1) ప్రకారం కేంద్ర హోమ్‌ మంత్రిత్వశాఖ పాకిస్తాన్‌ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసిందని డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు.  ఇతర వీసాలపై వచ్చిన పాకిస్తాన్‌ పౌరులందరూ ఈనెల 27 నాటికల్లా దేశం విడిచి వెళ్లాలని, వైద్యసేవల నిమిత్తం మెడికల్‌ వీసాలపై వచ్చిన పాకిస్తానీయులు ఈనెల 29 కల్లా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆదేశించిందని పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కాలపరిమితి దాటినా అక్రమంగా ఉంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.