ప్రమాదపు అంచుల్లో తుంగభద్ర డ్యామ్

ప్రమాదపు అంచుల్లో తుంగభద్ర డ్యామ్
రాయలసీమ వరప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర డ్యామ్‌ ప్రమాదపు అంచుల్లో చిక్కుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ గేట్లన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్ట్‌ గేట్లన్నీ తక్షణం మార్చాల్సిందేనని అల్ట్రా సౌండ్‌ పరీక్షల్లో తేలింది. 

మొత్తం 33 గేట్లలో 19 గేట్ల సామర్థ్యం 40 నుంచి 55 శాతానికి తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణుల అభిప్రాయాలతో రైతుల్లో కలవరం మొదలైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ కష్టమే: తుంగభద్ర డ్యామ్ మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కేంద్ర జలసంఘం, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ, ఏకే బజాజ్‌ కమిటీ సిఫార్సుల మేరకు తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేయించారు. 

రేడియోగ్రఫీ, అల్ట్రాసోనిక్, ఎంపీటీ, డీపీటీ పరీక్షల్లో నైపుణ్యమున్న కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్‌ అధ్యయనం చేసింది. ఆయా గేట్ల సామర్థ్యం బాగా తగ్గిపోయినందు వలన అన్నింటినీ మార్చాలని స్పష్టం చేసింది.  ఇదే విషయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ఏకే బజాజ్‌ కమిటీ సైతం తెలిపింది. దీనికి 250 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ప్రాజెక్ట్‌లోకి సాధారణంగా జులై నాటికి నీటి ప్రవాహం పెరుగుతుంది. 

అంటే మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా ఎంత మేర పనులు చేయగలరు తుంగభద్రలో ఎంత నీటిని నిల్వ చేయగలరనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

తుంగభద్ర డ్యాంలోని 32 గేట్ల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించిన కెఎస్ఎన్ డిటి సర్వీసెస్‌ భారీ నివేదిక ఇచ్చింది. ప్రతి గేటుకూ 15 రకాల ఫలితాలను తెలియజేసింది. తలుపులన్నీ భారీగా తుప్పు పట్టి, పెద్ద పెద్ద రంధ్రాలతో ఉన్నాయని, కొన్ని ప్రదేశాల్లో రంధ్రాల వల్ల గేటు ప్లేట్లు బాగా ధ్వంసమైనట్లు గుర్తించింది. గుస్సెట్‌ ప్లేట్లు, దిగువ స్టిఫెనర్లు, ఆ గేట్లకు సపోర్టుగా ఉండే గడ్డర్లు, సపోర్టింగ్‌ ప్లేట్లు కూడా బాగా తుప్పు పట్టి, చిల్లులు పడ్డాయని నివేదికలో పేర్కొంది.

గేట్లలో ప్లేట్లు అతికించిన ప్రదేశంలో వెల్డింగ్‌ అంతా బాగా దెబ్బతిని, పగుళ్లు ఏర్పడ్డాయంది. రివిట్లు చాలా వరకు తుప్పు పట్టేశాయని కొన్ని వాటి స్వరూపాన్నే కోల్పోయాయని గుర్తించింది. ఎండ్‌ బాక్స్‌ రోలర్‌లోనూ భారీ ఎత్తున తుప్పు పట్టేసింది. గేట్లు తుప్పు పట్టడం, అందుకు అనువైన పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటి అసలు స్వభావం కోల్పోయి ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. 

పాత వెల్డింగ్‌ జాయింట్లను మరమ్మతు చేసే పరిస్థితులు లేనందున మొత్తం గేట్లన్నీ మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.సాధారణంగా ప్రాజెక్టు గేట్ల జీవితకాలం 45 ఏళ్లు. అయికే ఈ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికే 70 ఏళ్లు దాటింది. నిరుడు ఆగస్టులో 19వ నంబర్‌ క్రస్ట్‌ గేటు కొట్టుకుపోయింది. మెకానికల్‌ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో తాత్కాలికంగా స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు చేసి, మళ్లీ నీటిని నిల్వచేసి, ఏదో విధంగా సీజన్ గట్టెక్కించారు. 

ఆ తర్వాత ఏకే బజాజ్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో నియమించిన సాంకేతిక కమిటీ ఈ గేట్లను అధ్యయనం చేసింది. తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం 33 గేట్లు దశలవారీగా మార్చాల్సిందేనని కిందటి ఏడాదే రిపోర్టు ఇచ్చింది. ‘40-45 ఏళ్లకు ఒకసారి హైడ్రో మెకానికల్‌ భాగాలు మార్చాల్సి ఉన్నా, తుంగభద్ర ప్రాజెక్ట్‌లో ఆ మార్పు చేయాలేదని తెలిపింది.