25 బేసిస్ పాయింట్లు రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ

25 బేసిస్ పాయింట్లు రెపోరేటు తగ్గించిన  ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది. ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించటం విశేషం. ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.

వడ్డీ రేట్లు తగ్గించటంపై ఆర్‌బీఐ గవర్నర్ బుధవారం మాట్లాడుతూ “రెపో రేటు తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం రెపో రేటును తగ్గించటం ఇది రెండో సారి. ప్రపంచ స్థాయిలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలపై ఆర్‌బీఐ ఓ కన్నేసి ఉంచింది. దిగుమతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అత్యధిక స్థాయిలో టారిఫ్ విధించారు. ఆ టారిఫ్‌ల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడుతుంది” అని తెలిపారు.

ఈ చర్యతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అంటే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తాయి. దీని వల్ల రుణగ్రహీతలకు ఊరట లభిస్తుంది. రెపో రేటు తగ్గడం వల్ల ఈ రుణాల ఈఎంఐలు తగ్గుతాయి. ఇది రుణగ్రహీతలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. లేదా రుణ కాల పరిమితి కూడా తగ్గించుకోవచ్చు. ఇదే సమయంలో.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని, ఇది డిపాజిటర్లకు నష్టం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితులు.. పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. దీని వల్ల ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధిక సుంకాలు ఎగుమతులను దెబ్బతీస్తాయని, అయితే తయారీ రంగంలో పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. త్రైమాసికాల వారీగా మొదటి, రెండవ త్రైమాసికాల్లో 6.5 శాతం, 6.7 శాతం, మూడవ, నాలుగవ త్రైమాసికాల్లో 6.6 శాతం, 6.3 శాతం ఉండవచ్చని తెలిపారు.  ఒకవైపు ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో 2025-26లో ద్రవ్యోల్బణం 4 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు ఆర్బీఐ గవర్నర్.
 
త్రైమాసికాల వారీగా 3.6 శాతం, 3.9 శాతం, 3.8 శాతం, 4.4 శాతం ఉండవచ్చని వెల్లడించారు. గత డిసెంబర్‌లో సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, ద్రవ్యోల్బణం 6.2 శాతం వద్ద ఉంది. ఇది ఆర్‌బీఐ లక్ష్యం (4 శాతం ± 2%) కంటే ఎక్కువ. అయితే, ఇప్పుడు ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రబీ పంట, పారిశ్రామిక కార్యకలాపాలు, సేవల ఎగుమతులు 2025-26లో వృద్ధిని మరింత మెరుగుపరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 4 నాటికి భారత్‌లో విదేశీ మారక నిల్వలు 676 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నిల్వలు రాబోయే 11 నెలల దిగుమతులను నిర్వహించడానికి సరిపోతాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు.