ఒక్క రోజులోనే 1000 ట్రంప్ గోల్డ్ కార్డుల విక్రయం

ఒక్క రోజులోనే 1000 ట్రంప్ గోల్డ్ కార్డుల విక్రయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలే గోల్డ్ కార్డు ఆఫ‌ర్ ప్రక‌టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5  స్థానంలో గోల్డ్‌ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 5 మిలియన్‌ డాలర్లు ‌(సుమారు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ట్రంప్‌ ప్రకటించిన ఈ గోల్డ్‌ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 1,000 గోల్డ్‌ కార్డులు విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ తాజాగా వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 5 బిలియన్‌ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా 37 మిలియన్ల మందికి గోల్డ్‌ కార్డును కొనుగోలు చేయగల సామర్థ్యం ఉంది. ఒక మిలియన్‌ మంది వీటిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నారు. 

వీటిద్వారా 5 ట్రిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని లుట్నిక్‌ పేర్కొన్నారు. అసలు ఈ గోల్డ్‌ కార్డు ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఎవరిదన్న ప్రశ్నకు బదులిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్‌దే అని బదులిచ్చారు. “పెట్టుబడిదారు జాన్ పాల్సన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఇది. అధ్యక్షుడి ఆలోచనను అమలు చేయడమే నా బాధ్యత. ఇందుకోసం నా వద్ద ప్రణాళిక ఉంది” అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత ఇబి5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో గోల్డ్ కార్డులను అధ్యక్షుడు దాదాపు ఒక నెల క్రితం ప్రకటించారు. పౌర‌స‌త్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నారు.  ఈ క్రమంలో ఈబీ-5 ఇమ్మిగ్రెంట్స్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫ‌ర్లను ప్రకటించారు. ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబ‌డి పెట్టే విదేశీయుల‌కు గ్రీన్ కార్డు ఇస్తారు. గోల్డ్ కార్డుల‌ను అమ్మనున్నామ‌ని, 5 మిలియ‌న్ల డాల‌ర్లకే ఆ కార్డును ఇవ్వనున్నట్లు ట్రంప్ గత నెల ప్రకటించారు.