ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

* యుఏఈలో 25 మంది భారతీయులకు మరణ శిక్ష

అంతర్జాతీయ మాదకద్రవ్య రవాణా కేసులో ముగ్గురు తమిళనాడుకు చెందిన భారతీయులు ఇండోనేషియాలో అరెస్టు అయ్యారు. 106 కిలోల డ్రగ్స్ తరలిస్తుండగా సింగపూర్ జెండా కలిగిన ఓడలో పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు. ముద్దాయిలకు అక్కడి కోర్టు మరణ శిక్ష  విధించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి.
 
తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్ డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరి విషయమై ఏప్రిల్ 15న అక్కడి కోర్టు తీర్పు ప్రకటించనుంది.  ఓడ కెప్టెన్‌తో పాటు ముగ్గురికి మరణశిక్ష విధించే అవకాశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 
 
భారత ప్రభుత్వం, న్యాయవాది ఈ కేసులో వారికి న్యాయం జరిగేలా చూస్తున్నట్లు సమాచారం. భారతీయ న్యాయవాది జాన్ పాల్  వారి తరఫున వాదనలు వినిపిస్తున్నారు. “కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలించడం సాధ్యం కాదు” అని కోర్టుకు వివరించారు.
 
“ఇది కుట్రగా కనిపిస్తోంది. అసలు నేరస్తులు తప్పిస్తూ, అమాయకులను ఇరికిస్తున్నారు” అని న్యాయవాది వాదించారు. నిజమైన నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను కాపాడాలని కోర్టును కోరారు. భారతీయుల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా?  ఇండోనేషియాలో డ్రగ్స్ అక్రమ రవాణా కఠినమైన నేరం, మరణశిక్ష తప్పదు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.
 
కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ)లో 25 మంది భారతీయులకు మరణ శిక్ష విధించారని, అయితే తీర్పు ఇంకా అమలు కావాల్సి ఉందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబులో వారి ప్రాణాలు కాపాడడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా చెప్పారు.
 
 “మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విదేశీ జైళ్లలో ప్రస్తుతం విచారణలో ఉన్న ఖైదీలలో భారతీయ ఖైదీల సంఖ్య 10152” అని ఆయన తెలిపారు. విదేశీ జైళ్లలో ఉన్న వారు సహా విదేశాల్లోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి చెప్పారు