రూ. 7 వేల కోట్లతో ఎటిఎజిఎస్ ఆయుధాల సేకరణ

రూ. 7 వేల కోట్లతో ఎటిఎజిఎస్ ఆయుధాల సేకరణ
* మిలిటరీ హార్డ్‌వేర్‌కు రూ.54,000 కోట్ల పెట్టుబడి

స్వదేశీ రక్షణ రంగానికి కేంద్రం చెప్పుకోతగిన ఆర్థిక ఆసరా కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ (సిసిసి) భారత సైన్యం కోసం ఎటిఎజిఎస్ (అడ్వాన్స్‌డ్ టువెడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ) ఆయుధాల సేకరణకు రూ.7000 కోట్లతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 

స్వదేశీయంగా అలాంటి హోవిట్జర్ ఆయుధాలను తయారు చేయడమే దీని లక్ష్యం. ఈ మేరకు 155 ఎంఎం ఆర్టిలరీ గన్ సిస్టమ్ తయారు అవుతాయి. ఈ ఆయుధాల వల్ల భారత సైన్యం తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి వీలవుతుంది. ఈ తుపాకీలు 52కాలిబర్ బారెల్, 45 కిమీ దూరంలో ఉన్న లక్షాన్ని ఛేదించగలుగుతాయి. 

ఈ ఒప్పందం వల్ల మొత్తం 307 తుపాకీలు, 327 సాయుధ వాహనాలు సమకూరుతాయి. డిఫెన్స్ రీసెర్చి డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డివొ) , భారత ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఆయుధాలు స్వదేశీయంగా తయారవుతాయి.  పశ్చిమాన పాక్, ఉత్తరాన చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి ఈ ఆయుధాలు అందిస్తారు. భారత సాయుధ దళాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న పాత 105 ఎంఎం, 130 ఎంఎం తుపాకులకు బదులుగా ఎటిఎజిఎస్ ఆయుధాలు వినియోగం లోకి వస్తాయి.

మరోవంక, మిలిటరీ హార్డ్‌వేర్‌కు రూ.54,000 కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపారు.  సైన్యానికి కావలసిన ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్, కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ టార్పెడోలు,టి90 టాంకులకు ఇంజిన్లు సమకూర్చుకోడానికి ఈ నిదులు వెచ్చిస్తారు. 2025ను సంస్కరణల సంవత్సరంగా రక్షణ శాఖ పరిగణిస్తోంది. ఈ మేరకు సైనికులకు కావలసిన సామగ్రిని సమకూరుస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఎసి ప్రతిపాదనలకు ఆమోదమైందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.