బీచ్ వద్ద కనిపించిన తెలుగు విద్యార్థిని దుస్తులు

బీచ్ వద్ద కనిపించిన తెలుగు విద్యార్థిని దుస్తులు
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్‌ రిపబ్లిక్‌ లోని ఓ రిసార్టులో బీచ్‌ వద్ద అదృశ్యం కాగా ఆమె కోసం వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో చివరిసారిగా సుదీక్ష కనిపించిన పుంటా కానా బీచ్‌ వద్ద ఆమెకు చెందినదిగా భావిస్తున్న దుస్తులను అధికారులు గుర్తించారు.

బీచ్‌ వద్ద ఉన్న లాంజ్ చైర్‌పై తెల్లటి నెటెడ్‌ సరోంగ్‌, లేత గోధుమ రంగు ఫ్లిప్‌-ఫ్లాప్‌ (పాదరక్షలు)ను అధికారులు గుర్తించారు. సుదీక్ష కోణంకి అదృశ్యమైన రాత్రి కనిపించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె చివరిసారిగా ధరించిన దుస్తులను పోలీ ఉన్నట్లుగా ఇవి ఉన్నాయి. ఆ దుస్తులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. 

ఎలాంటి ట్యాంపరింగ్ సంకేతాలు కనిపించడం లేదు. సముద్రంలోకి వెళ్లేముందు తన వస్తువులను లాంజ్‌ చైర్‌పై వదిలేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న 20 ఏళ్ల సుదీక్ష కోనంకి శీతాకాలం సెలవుల సందర్భంగా తన స్నేహితురాళ్లతో కలసి విహార యాత్ర నిమిత్తం డొమినికన్‌ రిపబ్లిక్‌ వెళ్లింది. 

డొమినికన్ రిపబ్లిక్‌ లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన పంటా కానాలోని రియూ రిపబ్లికా హోటల్‌కు చెందిన బీచ్‌ వద్ద మార్చి 6న చివరిసారి కనిపించింది. బీచ్‌ వద్ద ఉన్న సుదీక్ష పెద్ద అల వచ్చి సముద్రంలో గల్లంతై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.  అదృశ్యం కావడానికి ముందు సుదీక్ష మరో ఆరుగురు స్నేహితులతో కలసి బీచ్‌ వద్ద ఉన్నారని వారు చెప్పారు. అయితే మిగిలిన వారంతా రిసార్ట్‌కు తిరిగిరాగా సుదీక్ష, మరో అపరిచిత వ్యక్తి అక్కడే ఉండిపోయారని తెలిపారు. దీంతో ఆమె అదృశ్యం అవ్వడం వెనక కుట్ర కోణాన్ని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.