ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగింపు

ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగింపు

ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. 25, సెప్టెంబరు 2025 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‍ను పొడిగించినట్లు విజయానంద్ తెలిపారు. కాగా, వైసీపీ హయాంలో ముంబై నటి జత్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ వేధింపులకు పాల్పడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆగమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానీ కుటుంబాన్ని అరెస్టు చేశారు.

అనంతరం ఓ వ్యాపారవేత్తపై కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగి వేధించారు.  దీంట్లో సదరు ముగ్గురు ఐపీఎస్‍ల పాత్రా ఉందంటూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు కూటమి సర్కార్ కేసును సీఐడీకి బదిలీ చేసింది.

ఈ మేరకు వైసీపీ నేత విద్యాసాగర్, పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితుడు విద్యాసాగర్‍ను అరెస్టు చేయగా దాదాపు 76 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్‍పై విడుదల అయ్యాడు. మరోవైపు తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సదరు అధికారులు ఏపీ హైకోర్టును సైతం ఆశ్రయించారు.