విజయవంతంగా స్పాడెక్స్‌ శాటిలైట్స్‌ని అన్‌డాక్‌ చేసిన ఇస్రో

విజయవంతంగా స్పాడెక్స్‌ శాటిలైట్స్‌ని అన్‌డాక్‌ చేసిన ఇస్రో
లీ పండుగకు ముందు ఇస్రో దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. స్పాడెక్స్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా అన్‌డాక్‌ చేసినట్లు ప్రకటించింది. దాంతో చంద్రయాన్‌-4 మార్గం సుగమం అయ్యింది. అంతరిక్షలో ఉపగ్రహాలను కలిపే ప్రక్రియను డాకింగ్‌గా పిలుస్తారు. వాటిని మళ్లీ వేరే చేసే ప్రక్రియనే అన్‌డాకింగ్‌ అంటారు.  ఇస్రో గతేడాది డిసెంబర్‌ 30న శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పాడెక్స్) మిషన్‌ను ప్రారంభించింది.
ఈ మిషన్‌ విజయవంతం కావడంతో స్పేస్‌స్టేషన్‌, చంద్రయాన్‌-4 తదితర మానవ అంతరిక్ష కార్యకలాపాలకు మార్గం సుగమం కానున్నది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఇస్రోను అభినందించారు. ఇది ప్రతి భారతీయుడికి సంతోషకరమైన విషయమని చెబుతూ స్పాడెక్స్‌ ఉపగ్రహాలు అద్భుతంగా డీ డాకింగ్‌ జరిగాయని పేర్కొన్నారు.
ఇది భారత్‌ స్పేస్‌స్టేషన్‌, చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌ సహా భవిష్యత్‌లో ప్రతిష్టాత్మకమైన మిషన్‌లకు ఎంతో సహాయపడుతుందని తెలిపారు.  ఈ మిషన్లు ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా జనవరి 16న భాతర్‌ తొలిసారిగా స్పాడెక్స్‌ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. తొలిసారిగా స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ చేపట్టింది. ఇందులో ఇస్రో ఉపగ్రహాలను విజయవంతంగా డాక్‌ చేసింది.

డాకింగ్‌ టెక్నాలజీ కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా భారత్‌ ఘనత సాధించింది. ఇస్రో త్వరలోనే భారీ ప్రయోగాలను చేపట్టబోతున్నది. ఈ ప్రయోగాల కోసం తప్పినసరిగా డాకింగ్‌ టెక్నాలజీ అవసరం కాగలదు.  ఈ క్రమంలోనే ఇస్రో గతేడాది డిసెంబర్‌ 30న రెండు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ 60 రాకెట్‌ సహాయంతో ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఏడాది జనవరిలో స్పాడెక్స్‌ ఉపగ్రహాలు చేజర్‌, టార్గెట్‌ రెండు ఒక్కదానికొకటి దగ్గరగా తీసుకువచ్చి.. ఆ తర్వాత డాకింగ్‌ ప్రక్రియను ఇస్రో పూర్తి విజయవంతంగా పూర్తి చేసింది.