మ‌రో రెండు నెల‌ల్లో ఆర్ ఆర్ ఆర్ కు అనుమతులు

మ‌రో రెండు నెల‌ల్లో ఆర్ ఆర్ ఆర్ కు అనుమతులు

రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్ లు వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి 95శాతం భూసేకరణ పూర్తయ్యిందని ఆయన తెలిపారు. కేబినెట్ అప్రూవల్ వచ్చాక పరిహారం ఇస్తామని గడ్కరీ తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాంమ్మోహన్ నాయుడులతో మంగళవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపిలు భేటీ అయ్యారు. రీజనల్ రింగ్‌రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు.

హైదరాబాద్- టు విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరామని, రెండు ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణం జరిపేందుకు టెండర్లు పిలవాలని గడ్కరీ అధికారులను ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ఎలివెటెడ్ కారిడార్‌ను వేగవంతం చేయాలని కోరామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 

అటవీ భూములకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉన్నందున ప్రత్యేక సమావేశం పెట్టాలని అధికారులకు గడ్కరీ సూచించారని ఆయన తెలిపారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచేందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు. పర్వతమాల ప్రాజెక్టు కింద 5 రోప్ వేలు అడిగినట్లు కోమటిరెడ్డి తెలిపారు.

రాంమ్మోహన్ నాయుడుతో మామునూరు ఎయిర్ పోర్టు గురించి చర్చించామని, మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రితో తాను తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. జీఎంఆర్ నుంచి ఎన్‌ఓసి తీసుకున్నామని, మరికొన్ని అనుమతులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 

రెండున్నరేళ్లలో ఈ ఎయిర్ పోర్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్తగూడెం, రామగుండం పెద్దపల్లి ఎయిర్‌పోర్టు, ఆదిలాబాద్, నిజామాబాద్ జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఫీజిబిలిటీ పరిశీలించాలని ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులను కేంద్రమంత్రి రాంమ్మోహన్‌నాయుడు ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

మామునూర్ ఎయిర్ పోర్టుకు సంబంధించి 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి వారం పదిరోజుల్లో టెండర్లు పిలుస్తామని, పటౌడి హౌస్‌లో అన్ని సదుపాయాలతో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తామని, డిజైన్లు సిఎం ముందుంచామని, అన్ని సదుపాయాలతో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఉంటుందని మంత్రి వివరించారు.