రెండు రోజుల్లో భూమిపైనే అత్యంత తెలివైన ఎఐ గ్రోక్‌ 3

రెండు రోజుల్లో భూమిపైనే అత్యంత తెలివైన ఎఐ గ్రోక్‌ 3

created by InCollage

ప్రపంచంలో ఉన్న టెక్‌ దిగ్గజాలన్నీ ఎఐ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ లో పోటీపడుతున్న వేళ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరోసారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై కీలక ప్రకటన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మస్క్‌ నేతృత్వంలోని కృత్రిమ మేధ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ అత్యంత అధునాతనమైన గ్రోక్‌ 3 సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. భూమిపైన అత్యంత తెలివైన ఎఐ సాధనంగా దీన్ని మస్క్‌ అభివర్ణించారు.
 
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు ఈ కొత్త మోడల్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గ్రోక్‌ చాట్‌బాట్‌ సేవలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. చాట్‌జీపీటీకి పోటీగా మార్కెట్లోకి వచ్చిన గ్రోక్‌, మెరుగైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంది. తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా గ్రోక్‌ 3 విడుదల కానున్నట్లు మస్క్‌ ప్రకటించారు. 
 
అయితే దీని సామర్థ్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. టెక్‌ నిపుణుల అభిప్రాయానుసారం ఈ కొత్త మోడల్‌ టెక్ట్స్‌-టు-వీడియో వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉండే అవకాశముంది. ఈ అప్‌గ్రేడ్‌తో, గ్రోక్‌ 3 ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన జీపీటీ-4, గూగుల్‌ జెమిని వంటి ఏఐ మోడళ్లకు ప్రధాన పోటీదారుగా నిలవనుంది. 
 
ప్రస్తుతం కృత్రిమ మేధ విభాగంలో పోటీ తీవ్రంగా పెరిగింది. ఓవైపు ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ మోడళ్లను నిరంతరం అభివృద్ధి చేస్తుండగా, గూగుల్‌ జెమినీని మరింత మెరుగుపరుస్తోంది. మెటా తన LLaMA సిరీస్‌ను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలాన్‌ మస్క్‌ గ్రోక్‌ 3ను ప్రవేశపెట్టడం టెక్‌ ప్రపంచంలో కీలక పరిణామంగా నిలిచింది.