
* చిలుకూరి రంగరాజన్ పై దాడి పట్ల ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ఆగ్రహం
చిలుకూరు దేవాలయం ప్రధానార్చకులు రంగరాజన్ గారిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా ఖండించాయి. ఈ అమానుష దాడికి పాల్పడిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ తెలిపింది.
దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రంగరాజన్ గారిపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, సామాజిక విలువలు, సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక – దేవాలయ వ్యవస్థపైన, మొత్తంగా హిందూ సమాజంపైనే జరిగిన దాడిగా ఆర్ఎస్ఎస్ భావిస్తున్నదని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్ట రాజు గోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
సామాజిక సమరసత కోసం కృషి చేస్తున్న రంగరాజన్ గారిపై దాడి ఎంతమాత్రం క్షమార్హం కాదని స్పష్టం చేశారు. సమాజంలోని వ్యక్తులు, వ్యవస్థలు రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మానవతా విలువలతో కూడిన పటిష్టమైన సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఆయన తెలిపారు.
ధర్మపరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసం స్వార్థపూరిత చర్యలకు పాల్పడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని తేల్చి చెప్పారు. ఇటువంటి వ్యక్తులే రంగరాజన్ గారిపై దాడి చేశారంటూ ఈ సంఘ విద్రోహులను చట్టప్రకారం విచారించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవస్థలను నియంత్రించాలనుకునే నియంతృత్వ పోకడలకు పౌర సమాజంలో చోటు లేదని నిర్ద్వంద్వంగా తెలియచేశారు.
అమానుషంగా ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) డిమాండ్ చేసింది. రంగరాజన్ గారిపై జరిగిన దాడి దేవాలయ వ్యవస్థపై, అర్చక వ్యవస్థపై, సామాజిక సంస్కరణ వ్యవస్థపై, ఇంకా యావత్ హిందూ సమాజంపై జరిగిన దాడిగా వీహెచ్పీ భావిస్తున్నదని స్పష్టం చేసింది.
దాడికి పాల్పడ్డ సంఘ విద్రోహ శక్తులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నదని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు భోజనపల్లి నర్సింహ మూర్తి, జాతీయ అధికార మీడియా ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మపరంపరకు అవమానం కలిగించిన దోషులను హిందూ సమాజం ఏనాటికి క్షమించదని వారు స్పష్టం చేశారు.
రంగరాజన్ గారి మీద జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నిందితుల వెనుకనున్న సంఘవిద్రోహ శక్తులను చట్టప్రకారం ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలు పోలీసులు వెంటనే తీసుకోవాలని వారు కోరారు.,రంగరాజన్ గారికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణా ప్రభుత్వంకు సూచించారు.
హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి రంగరాజన్ గారు చేస్తున్న ఉద్యమంలో తాము ఎల్లప్పుడు ముందుంటామని వీహెచ్పీ తెలిపింది.
యజ్ఞం నిర్వహిస్తున్న మునుపై దాడులకు పాల్పడిన రాక్షసులను శ్రీరామచంద్రుడు కఠినంగా దండించి రామరాజ్యంలో శాంతిని కాపాడాడని, అదే విధంగా నేడు చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్ పై రాక్షస భావజాలంతో దాడి జరిపిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణా ప్రభుత్వాన్ని వీహెచ్పీ కోరింది.
More Stories
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మహేందర్రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్