దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
 
* నూతన ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు శుక్రవారం లాంఛనంగా ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని, దీనివల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్థి చెందుతాయని వెల్లడించారు. 

కొత్త జోన్‌ వల్ల రైల్వే ఆపరేషన్లలో సమర్థత పెరుగుతుందని చెప్పారు. కుదించిన వాల్తేరు డివిజన్‌ను ఇకపై విశాఖ డివిజన్‌గా పరిగణిస్తారని, వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగం (410 కిలోమీటర్లు) విశాఖపట్నం డివిజన్‌గా దక్షిణ కోస్తా జోన్‌లో ఉంటుందని తెలిపారు. వాల్తేరు డివిజన్‌లోని మిగతా భాగం (680 కిలోమీటర్ల)తో కొత్తగా తూర్పు కోస్తా రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పడుతుందని చెప్పారు. 

పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాన్ని ఈ నిర్ణయంతో నేరవేర్చినట్టయిందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటించారని అశ్వినీ వైష్ణవ్‌ గుర్తు చేశారు. క్యాబినెట్‌ ఆమోదంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అధికారికంగా ఉనికిలోకి వచ్చినట్టయింది. కాగా, దీంతోపాటు మరో మూడు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వాల్తేరు డివిజన్‌లోని ఒక భాగం పలాస-విశాఖపట్నం – దువ్వాడ, కూనేరు – విజయనగరం, నౌపడ జంక్షన్‌ – పర్లాఖిమిడి, బబ్బిలి జంక్షన్‌-సాలూరు, సింహాచలం నార్త్‌ – దువ్వాడ బైపాస్‌, వడ్లపూడి – దువ్వాడ, విశాఖపటుం స్టీల్‌ప్లాంట్‌ – జగ్గయపాలెం (సుమారు 410 కిలోమీటర్ల) స్టేషన్లు ఉంటాయి. దీనినికొత్త సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కింద వాల్తేరు డివిజన్‌గా కొనసాగించనున్నారు.

వాల్తేరు డివిజన్‌లోనిమరో భాగం కొత్తవలస – బచేలి, కూనేరు – తెరువాలి జంక్షన్‌, సింగపూర్‌ రోడ్‌ – కోరాపుట్‌ జంక్షన్‌, పర్లాఖిమిడి – గన్పూర్‌ (సుమారు 680 కిలోమీటర్ల) స్టేషన్ల మధ్య ఉంటాయి. దీనిని తూర్పు కోస్ట్‌ రైల్వే పరిధిలోనిరాయగడ్‌లో ప్రధాన కార్యాలయంతో కొత్త డివిజన్‌గా మారుస్తారు.

కాగా, ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఐటీ చట్టం స్థానంలో తేనున్న కొత్త ఇన్‌కం ట్యాక్స్‌ బిల్లుకు ఆమోదం. ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని సరళతరం చేసేందుకే దీన్ని రూపొందించారు. వచ్చేవారంలో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపుతారు.

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రత్యక్ష పన్ను చట్టాన్ని అర్థం చేసుకోవడానికి, సులభతరం చేయడానికి కొత్త బిల్లును తీసుకొస్తునుట్లు కేంద్రం చెబుతోంది. నూతన బిల్లుతో కొత్తగా ఎలాంటి పన్నుల భారాలు విధించబోమనికూడా ప్రకటించింది. కొత్త బిల్లులో వివరణలు, నిబంధనలు, సుదీర్ఘ వ్యాఖ్యలు ఉండవని తెలిపింది.

2022-23 నుంచి 2025-26 వరకూ రూ.8,800 కోట్ల వ్యయంతో ‘స్కిల్‌ ఇండియా’ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించి 2026 దాకా కొనసాగించాలన్న ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌. కాగా.. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) 4.0, ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటి్‌సషిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌(పీఎం-న్యాప్స్‌), జనశిక్షణ్‌ సంస్థాన్‌ స్కీమ్‌(జేఎ్‌సఎ్‌స)లను ‘స్కిల్‌ ఇండియా ప్రోగ్రాం’ పరిధిలోకి తీసుకొచ్చినట్టు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

జాతీయ పారిశుధ్య కార్మికుల కమిషన్‌ కాలపరిమితిని 31.03.2025 నుంచి 31.03.2028 వరకూ పొడిగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.