ఎస్‌బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు

ఎస్‌బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం రూ.16,891 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.9,164 కోట్ల లాభం తో పోలిస్తే 84 శాతం వృద్ధి కనబరిచింది. 2024-25లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో నమోదైన రూ.18,331 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గింది. మరిన్ని ముఖ్యాంశాలు:
* ఈ క్యూ3లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.41,446 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి బ్యాంక్‌ రుణాలు దాదాపు 14 శాతం వృద్ధి చెంది రూ.40.68 లక్షల కోట్లకు చేరినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మాత్రం 0.19 శాతం తగ్గుదలతో 3.15 శాతానికి పరిమితమైంది.* డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ డిపాజిట్లు 9.81 శాతం వృద్ధితో రూ.52.3 లక్షల కోట్లకు పెరిగాయి. అందులో దేశీయ బ్రాంచీల్లోని కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్‌ అకౌంట్ల (కాసా) డిపాజిట్లు 4.46 శాతం పెరిగి రూ.19.65 లక్షల కోట్లకు చేరాయి.

*‘‘కస్టమర్ల ప్రాధాన్యాలు మారడంతో సమీక్ష కాలానికి బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ 3.15 శాతానికి తగ్గింది. కస్టమర్లు పొదుపు ఖాతాల కంటే అధిక వడ్డీ ఆదాయం అందించే ఎఫ్‌డీల్లో సొమ్ము జమ చేస్తున్నారు. అయితే, మార్జిన్‌ 3 శాతం కంటే తగ్గదు. గత త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లలో 39.2 శాతానికి తగ్గిన కాసా అకౌంట్ల వాటా మళ్లీ పెంచడం కష్టమే’’నని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు.

* ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, డిసెంబరు చివరి నాటికి బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 2.07 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.53 శాతానికి జారుకున్నాయి. ఈ క్యూ3లో కొత్త రూ.3,823 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయని బ్యాంక్‌ తెలిపింది.